ఏపీలో థియేటర్లు తెరవాలా -వద్దా : ప్రభుత్వం-టాలీవుడ్ కు అల్టిమేటం -నేడు కీలక భేటీ..!!
ఏపీలో సినిమా థియేటర్లు అన్నీ తెరుచుకుంటాయా. లేక, మిగిలిన థియేటర్లు స్వచ్చందంగా మూసేస్తారా. ఏం జరగబోతోంది. టికెట్ ధరలు తగ్గింపు, థియేటర్లతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై సినిమా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ యజమానులు సమావేశం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సెంటర్ల ను గ్రేడ్ ల వారీగా విభజించి..టిక్కెట్ ధరలను ప్రకటించింది. ఆ ధరలతో తాము థియేటర్లను నిర్వహించలేమంటూ యజమానులు కోర్టుకు వెళ్లారు.
డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం అప్పీల్
దీని పైన విచారించిన కోర్టు సినిమా టిక్కెట్ల ధరలను తగ్గింపు జీవోను సస్పెండ్ చేసింది. దీంతో.. ఏపీ ప్రభుత్వం దీని పైన హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో జాయింట్ కలెక్టర్లకు అధికారాలు అప్పగించారు. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. సినిమా టికెట్ ధరలు అధికంగా అమ్మినా, సినిమా థియేటర్లకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా సీజ్ చేస్తున్నారు.
50 థియేటర్లకు పైగా సీజ్
అయితే గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50కిపైగా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. కొన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేశాయి. అయితే టికెట్ ధరలు తగ్గింపు, థియేటర్లతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఈ సమస్య పరిష్కారానికి టాలీవుడ్ ప్రముఖులు నేరుగా సీఎం జగన్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
నేడు ఎగ్జిబిటర్ల కీలక సమావేశం
ఇందు కోసం సీఎంతో కొంత కాలం క్రితం వరకు సినిమా పరిశ్రమ సమస్యల పైన పరిష్కారం కోసం చర్చలకు లీడ్ తీసుకున్న చిరంజీవి..నాగార్జున ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ముందుగా మంత్రి పేర్ని నానితో సమావేశమై.. ఆ తరువాత సీఎంతో చర్చించాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఇదే సమయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఈ రోజు సినిమా టిక్కెట్ల ధరల కేసు విచారణకు రానుంది.
ఇటు హైకోర్టులో విచారణ
అటు కోర్టు నిర్ణయం..ఇటు సినిమా థియేటర్ల యజమాలను నిర్ణయాలకు అనుగుణంగా టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వంతో చర్చల అంశం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇక, త్వరలో భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియా సినిమాలు విడుదల తేదీలు దగ్గర పడుతున్నాయి.
ఈ లోగానే ప్రభుత్వంతో సమస్య పరిష్కరించుకోవాలని టాలీవుడ్ భావిస్తోంది. సమస్య పరిష్కారం కాకుంటే భారీ నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో..ఈ రోజు జరిగే తూర్పు గోదావరి జిల్లా థియేటర్ల యజమానుల సమావేశం.. అదే విధంగా హైకోర్టులో విచారణ తరువాత ఈ మొత్తం ఎపిసోడ్ లో భవిష్యత్ కార్యాచరణ పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.