ముఖ్యమంత్రి జగన్ చెబితే మాకేంటి? అంతా మా ఇష్టం??
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తవుతోంది. ముఖ్యమంత్రి అయిన కొత్త నుంచి ఇప్పటివరకు వినోదమనేది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, థియేటర్లలో అత్యధి ధరలు పెట్టి పేదలను, మధ్యతరగతిని సినిమాలకు దూరం చేయవద్దని సినీ పరిశ్రమకు చెందిన పెద్దలను కోరారు. వారంతా సరే అన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన సినీ పెద్దలు
కానీ తాము ఇంత భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించాం కాబట్టి.. ప్రత్యేకంగా టికెట్లు పెంచుకోవడానికి అనుమతులివ్వాలంటూ చిరంజీవి, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ప్రభాస్ లాంటివారంతా జగన్ ను కలిసి విన్నవించారు. ఆయా సినిమాల బడ్జెట్ ను బట్టి ఒక వారంరోజులపాటు అధిక ధరలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కరోనా తర్వాత ప్రజలు థియేటర్లకు రావడమే తగ్గించారు. దీనికితోడు ఒక కుటుంబం థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే రూ.2వేల నుంచి రూ2,500 వరకు ఖర్చవుతోంది. దీంతో ప్రేక్షులు ఓటీటీలవైపుకు మళ్లారు.

ధరలు పెంచడంలేదంటూ ప్రకటనలిచ్చుకోవాల్సి వస్తోంది
ఒకప్పుడు సినిమా బాగున్నా, బాగోలేకపోయినా ప్రజలు థియేటర్ కు తరలివచ్చేవారు. టికెట్ ధరలు తక్కువ ఉండటంతోపాటు క్యాంటిన్లలోని ధరలు కూడా సరసమైన ధరలోనే ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కొండెక్కి కూర్చున్నాయి. ఈ పెరిగిన ధరలను చూసి అసలు థియేటర్లకు రావడమే మానేశారు. దీంతో ముఖ్యమంత్రిని కలిసి ధరలు పెంచుకోవడానికి అనుమతులు కోరిన వారంతా తమ తర్వాత సినిమాలు విడుదలవుతున్నాయంటే పాత ధరలేనని, ధరలు పెంచడంలేదంటూ ప్రకటనలిచ్చుకోవాల్సి వస్తోంది.

ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి
తాజాగా సంక్రాంతి బరిలోకి ముందుగా అజిత్ తెగింపు, విజయ్ వారసుడు, బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్యతోపాటు మరో రెండు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. వీటికి మల్టీప్లెక్స్ లో మరోసారి బాదుడు ప్రారంభించారు. టికెట్ పై అదనంగా 100 రూపాయలు పెంచారంటూ అభిమానులు మండిపడుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలోను ఇదే పరిస్థితి ఉత్పన్నం కాబోతోంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పాత టికెట్ ధరల ప్రకారమే సినిమాలు ప్రదర్శించేలా ఉత్తర్వులివ్వాలని సినీ అభిమానులు కోరుతున్నారు. పండగ సమయం కాబట్టి తమ అభిమానాన్ని నిర్మాతలు, థియేటర్ యాజమాన్యం 'క్యాష్' చేసుకోనివ్వకుండా చూడాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications