రాజధానిపై జగన్ని కలిశారు, ఆ రెండింటి కోసం డిమాండ్
హైదరాబాద్: కర్నూలు లేదా దొనకొండను రాజధానిగా చేసేలా కృషి చేయాలని సిటిజన్ ఫోరం ప్రతినిధులు మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. వారు జగన్కు ఓ వినతి పత్రం ఇచ్చారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును లేదంటే ప్రకాశం జిల్లా దొనకొండను రాజధాని చేయాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాయలసీమ, కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన రాజధాని అన్నారు. ఇదే విషయాన్ని తాము చంద్రబాబుకు చెప్పామన్నారు. ఇప్పుడు జగన్కు అదే విషయం చెప్పామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
ఆ రెండింటి మధ్యే...!
ఏపీ రాజధాని పైన విస్తృత చర్య సాగుతున్న విషయం తెలిసిందే. గుంటూరు - రాజధాని మధ్య, అమరావతి కేంద్రంగా, దొనకొండ.. ఇలా పలు పేర్లు తెర పైకి వస్తున్నాయి. అయితే, విజయవాడ - గుంటూరు, దొనకొండల మధ్యనే ప్రధానంగా చర్చ జరుగుతోందట. విజయవాడ-గుంటూరుతో పాటు దొనకొండను రాజధానిగా చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలే మాజీ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఛీప్ సెక్రటరీ కె జయభారతరెడ్డిలు దొనకొండను రాజధాని చేస్తే ప్రయోజనాలను వివరిస్తూ నివేదికను తయారు చేశారు.
దీనిని చంద్రబాబుకు ఇచ్చారు. విజయవాడ-గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలంటే భూమి సమస్య ఉత్పన్నమవుతోందని కానీ, దొనకొండ ప్రాంతంలో ఆ సమస్య ఉండదని చెప్పారు. దొనకొండ ప్రాంతం చుట్టూ లక్షన్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుంటే సువిశాలమైన రాజధానిని, పక్కా ప్రణాళికతో నిర్మించుకోవచ్చని చెబుతున్నారు.
అంతేకాకుండా దొనకొండ అటు రాయలసీమకు, ఇటు కోస్తాకు సరిగ్గా మధ్యలో ఉంటుందంటున్నారు. అయితే, దొనకొండ అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉందన్న వాదనపై ప్రభుత్వ వర్గాలు అనుమానపడుతున్నాయి. అలాగే, దొనకొండ ప్రాంతంలో నీటి సమస్యపై కూడా ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి.