సుప్రీం జడ్జి తల్లికి సీజేఐ పాదాభివందనం - మాతృభాషను మరువద్దు : న్యాయ వ్యవస్థకు కీలక పాత్ర..!!
ఏపీ పర్యటనలో ఉన్న సీజేఐ ఎన్వీ రమణ సుప్రీం న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు తల్లికి పాదాభివందనం చేసారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు తల్లి నాగేంద్రమ్మ తనకు అమ్మలేని లోటును తీర్చారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయమూర్తిగా బాగా పనిచేస్తున్నానని తనను ఆశీర్వదించినందుకు నాగేంద్రమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
న్యాయమూర్తలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యమన్న సీజేఐ.. ప్రస్తుతం హ్యాకింగ్ అతిపెద్ద సమస్యగా మారిందన్నారు.దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. న్యాయమూర్తులపై జరుగుతోన్న దాడులపై సీజేఐ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో జడ్జిలపై భౌతిక దాడులు పెరిగాయని.., కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకూ ఆ దాడుల కేసులపై దర్యాప్తు జరగటం లేదన్నారు. ప్రస్తుతం న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పెరిగిపోతోన్న విషయాన్నీ ప్రస్తావించారు. చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని.., న్యాయస్థానాల్లో సరిపడా జడ్జిలు లేకపోవటం అందుకు కారణమన్నారు.
జడ్జిలు సమాయాభావం లేకుండా కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారన్న సీజేఐ.. ప్రాసిక్యూటర్లను నియమించేందుకు ప్రత్యేక స్వతంత్ర కమిటీ వేయాలని అభిప్రాయపడ్డారు. 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని, సరైన సమయంలో సరైన నిర్ణయంతో దాన్ని అధిగమించామన్నారు. ఆ తర్వాత కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిందని.., విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆర్థిక సంస్కరణలు వచ్చాయన్నారు. భారత న్యాయవ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని..,వాటిని సమర్థంగా ఎదుర్కొంటోందన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని.., రాజ్యాంగ పరిధుల మేరకు అందరూ పనిచేయాలన్నారు. న్యాయవ్యవస్థలో ప్రతీ చర్యకు స్థిరమైన రికార్డు ఉండాలన్నారు. న్యాయమూర్తలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యమని సీజేఐ చెప్పుకొచ్చారు.