కిరణ్ రెడ్డి హయాంలో: బాలకృష్ణ వియ్యంకుడు, మురళీ మోహన్ భూముల ఇష్యూ!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సాక్షి దినపత్రిక ఆరోపణల పైన ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నవ్యాంధ్ర రాజధానిలో పెద్ద ఎత్తున భూకుంభకోణం జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇందుకు సంబంధించి జీవో ప్రతి విడుదల చేసింది.
ఎంపీ మురళీ మోహన్ తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఎడెకరాల విస్తీర్ణంలో జాయింట్ వెంచర్గా జయభేరి సంస్థ ద్వారా రెసిడెన్షియల్ ప్లాట్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నది నిజమేనని, అది 2014 జనవరిలో, విభజన జరగకముందు, రాజధాని ఎక్కడో తెలియక ముందు చేసుకొన్న ఒప్పందమని తెలిపింది.
దీనికి సంబంధించి అనుమతులన్నీ వచ్చేసినట్లుగా, సగం పైగా ప్లాట్లను ఎన్ఆర్ఐలకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లుగా బురద జల్లుతున్నారని, విమానాశ్రయ అధికారుల నుంచే కాకుండా ఇంకా చాలా అనుమతులు రావాల్సి ఉందని, ఏం రాకుండానే, పనులు ప్రారంభం కాకుండానే అమ్మి సొమ్ముచేసుకున్నట్లు కట్టుకథలు అల్లారని పేర్కొంది.
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ వియ్యంకుడికి 430 ఎకరాల భూమి విషయమై స్పందిస్తూ.. 2007లో కృష్ణా జిల్లా జయతీపురంలో 430 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో విబిసి కంపెనీ పెట్టుబడి రూ.7,500 కోట్లుగా ఉందని, ప్రత్యక్ష ఉపాధి 2,700 మందికి అని పేర్కొన్నారు.
కేంద్రం అప్పుడే అనుమతి ఇచ్చిందని, ఆ తర్వాత 2010లో సిసిఎల్ఏ ప్రతిపాదనలు పంపిందని, 2012లో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దీనిపై ఎంఓయూ జరిగిందని పేర్కొంది. దీన్ని ఎకరా లక్ష రూపాయలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమేనని పేర్కొంది. కేవలం భూమిని ఏపీఐఐసీకి బదలాయిస్తూ మాత్రమే ఈ ప్రభుత్వం జీవో 269 ఇచ్చిందని పేర్కొంది.