అణిచి వేయండి, హమ్ ఆప్ కే సాత్ హై- మోదీకి చంద్రబాబు భరోసా..!!
అమరావతి పున:ప్రారంభ సభ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రసంగం చేసారు. పహల్గాం దాడి అంశాన్ని ప్రస్తావించారు. పహల్గాం దాడి బాధను తాను మోదీలో చూసానని చెప్పుకొచ్చారు. అమరావతి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్న రోజు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఉగ్రవాదం అణిచివేసేందుకు తీసుకునే ఏ చర్యకైనా ఏపీకి చెందిన అయిదు కోట్ల మంది మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. అమరావతి భవిష్యత్ కు ప్రధాని మోదీ మద్దతు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
హిందీలో చంద్రబాబు
అమరావతి పనుల రీ లాంఛ్ సభలో చంద్రబాబు హిందీలో ప్రసంగించారు. గతంలో మోదీతో భేటీ ఆహ్లాదకరంగా ఉండేదని, ఇటీవల అమరావతికి రావాలని పిలవడానికి వెళ్లినప్పుడు ఆయన గంభీరంగా ఉన్నారని తెలిపారు. దానికి కారణం పహల్గామ్ ఉగ్రదాడి అని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రధాని తీసుకొనే ఏ నిర్ణయానికైనా రాష్ట్రం తరఫున అండగా ఉంటామన్నారు. ఉగ్ర దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న ఆవేదన మోదీలో కనిపించిందన్నారు. మోదీ తీసుకునే ప్రతి చర్యకు మేం మద్దతుగా ఉంటామని చెప్పారు..."మోదీ జీ హమ్ ఆప్ కే సాత్ హై! ఆంధ్రప్రదేశ్ కే పాంచ్ కరోర్ లోగ్ ఆప్ కే సాత్ హై..! పూరా దేశ్ ఆప్ కే సాత్ హై! అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. సభికులతో వందేమాతరం అని నినాదాలు ఇప్పించి మోదీకి మద్దతు తెలిపారు.

వందేమాతరం నినాదాలతో
ముఖ్యమంత్రి స్పీచ్ కు ప్రతిగా స్వయంగా చెయ్యెత్తి వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ ప్రధాని నినాదాలు చేసారు. ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని చెప్పారు. మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ ఉండేదన్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి ఎదిగిందని చెప్పారు.
అమరావతికి మద్దతుగా
త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుంది. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు పేదరిక నిర్మూలనకు ప్రధాని కృషి చేస్తున్నారని వివరించారు. దేశాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. కులగణన చేయాలని మోదీ నిన్న నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. కుల గణన చేయాలన్నది గొప్ప నిర్ణయంగా పేర్కొన్నారు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications