నేనే నేరుగా వారితో మాట్లాడుతాను - చంద్రబాబు..!!
ఏపీలో పారిశ్రామికీకరణ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేసారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి కీలక సమీక్షలు నిర్వహించారు. పరిశ్రమల శాఖలో గత ఐదేళ్లుగా జరిగిన వ్యవహారాలపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. గత అయిదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు...కొత్త పరిశ్రమలకు భరోసా గురించి చర్చించిన చంద్రబాబు అధికారులకు కీలక దిశా నిర్దేశం చేసారు.
కీలక నిర్ణయం
పారిశ్రామిక రంగం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారిక సమీక్షలో పలు అంశాల పైన చర్చించారు. టీడీపీ హయాంలో వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని అధికారులు చంద్రబాబుకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఇలా జరిగిందని తెలిపారు. భూములు కేటాయించిన తర్వాత కూడా వెనక్కి వెళ్లిపోయారని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు కూడా దుర్వినియోగం అయ్యాయని వారు ముఖ్యమంత్రికి వెల్లడించారు.

పారిశ్రామీకరణ దిశగా
ఈ క్రమంలోనే కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాలని చంద్రబాబు అన్నారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించేందుకు తానే మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లో భూముల లభ్యత, పారిశ్రామిక అనుకూల ప్రాంతాలపై చర్చలు నిర్వహించారు. కేంద్రం బడ్జెట్ లో ఏపీలో రెండు ఇండస్ట్రియల్ కారిడార్ల గురించి ప్రస్తావన చేసింది. మౌళిక వసతుల గురించి హామీ ఇచ్చింది. దీంతో..ఏపీలో పారిశ్రామిక కారిడార్ల పైన ఈ సమీక్షలో చర్చించారు. అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేసారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
అయిదు నూతన పాలసీల రూపకల్పనతో పాటుగా రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో కొత్తగా ఇండస్ట్రియల్ క్లసర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు పెండింగ్ ఏ మేర ఉన్నాయి... కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చే వారికి ఏ మేర ప్రోత్సాహకాలు ఇవ్వాలనే అంశం పైన చర్చ జరిగింది. రాష్ట్రంలో గతంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చి...వెనుకడుగు వేసిన సంస్థల తోనూ చర్చలు చేసేందుకు ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications