తెలంగాణకు అడ్డు చెప్పలేదు, విద్వేషాలు కాదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. దీని పైన ఏపీ మంత్రి రామానాయుడు స్పష్టత ఇచ్చారు. కాగా, సీఎం చంద్రబాబు సైతం ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించామని చెప్పారు. కాళేశ్వరం కట్టే సమయం లో అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు మహాసభలో కీలక ప్రసంగం చేసారు. దేశంలో జాతీయ భావన పెరగాలని వ్యాఖ్యానించారు. ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. మాతృభాష అమ్మతో సమానమని పేర్కొన్నారు. మాతృ భాషలో చదువుకున్న వారు ప్రపంచంలో ఏమైనా చేయగలరని చెప్పుకొచ్చారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన అమ్మభాష పండుగ ఇదని తెలిపారు. దేశంలో అనేక భాషలు ఉన్నా.. ఆరు భాషలకు మాత్రమే ప్రాచీన హోదా ఉందని వెల్లడించారు. ఇలాంటి సభలు తెలుగు భాష గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయని వివరించారు.

భాషాప్రయుక్త రాష్ట్రాలు రావాలని పోరాడిన వ్యక్తి మహనీయుడు పొట్టి శ్రీరాములును మరవలేమని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలవాలని పోరాడిన బూర్గుల రామకృష్ణారావు త్యాగం మరవలేమని చెప్పుకొచ్చారు. వారసులుగా భాషను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. మన ప్రాస, యాస, సందులు, సమాసాలు చాలా ప్రత్యేకమైనవని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మాతృభాష మన మూలాలకు సంకేతంగా చంద్రబాబు అభివర్ణించారు. టెక్నాలజీతో భాష కనుమరుగవుతుందని అన్నారని.. కానీ టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తన హయాంలో.. తెలంగాణలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు అడ్డుపడలేదని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు.. సమైక్యత అవసరమని చంద్రబాబు వివరించారు. నీటి విషయంతో పాటు ఇతర అంశాల్లో తెలుగువారు కలిసే ఉండాలి. గంగా-కావేరి కలవాలి.. దేశంలో నీటి సమస్య పూర్తిగా తీరాలి.. అదే తన కోరికని స్పష్టం చేసారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కావాలన్నారు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే ఎప్పుడూ అడ్డుచెప్పలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications