వైసీపీ 'పెద్దల' పై టీడీపీ- బీజేపీ జాయింట్ ఆపరేషన్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం 2025 -26 బడ్జెట్ ను భారీ అంచనాలతో ప్రవేశ పెట్టింది. ఆర్దికంగా సమస్యలు వెంటాడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పైన కూటమిలో చర్చ మొదలైంది. ఇటు అయిదు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు కొనసాగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీ తో సహా కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ పర్యటనలో రాజకీయ లెక్కలు చర్చకు రానున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఢిల్లీకి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 5, 6 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. 5న ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అదే రోజు రాత్రి తిరిగి విశాఖపట్నం చేరుకుని, అక్కడే బస చేస్తారు. 6వ తేదీ చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్య క్రమంలో పాల్గొంటారు. తిరిగి విశాఖ నుంచే అదే రోజు మధ్యాహ్నం నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. 6వ తేదీన ఓ ఆంగ్ల చానల్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్దిక సంవత్సరం ముగుస్తున్న వేళ కేంద్రం నుంచి ఆర్దికంగా దక్కించుకునే వెసులుబాటు పైన ముఖ్యమంత్రి చర్చలు చేసే అవకాశం కనిపిస్తోంది.

కీలక చర్చలు
ఇదే సమయంలో రాజకీయంగానూ ఢిల్లీ నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. అయిదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. జనసేన నుంచి నాగబాబుకు సీటు ఖాయమైంది. బీజేపీ తమకు ఒక స్థానం ఇవ్వాలని కోరుతోంది. ఈ సమయంలోనే సాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో, ఎమ్మెల్సీ స్థానం వచ్చే సారి బీజేపీకి కేటాయించేలా టీడీపీ ప్రతిపాదిస్తోంది. ఇక.. వైసీపీ నుంచి మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.
ఢిల్లీ కేంద్రంగా
ఈ ఇద్దరు ఎంపీలు బీజేపీ - టీడీపీలో చెరొకరు చేరే విధంగా చర్చలు చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరి తోనూ బీజేపీ టచ్ లో ఉండటంతో... తమ పార్టీలోనే చేరుతారని ఢిల్లీ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది.ఈ అంశం పైన చంద్రబాబు రాజకీయ చర్చల్లో తన అభిప్రాయం స్పష్టం చేసే ఛాన్స్ ఉందని పార్టీ నేతల సమాచారం. ఇక, ఈ నెల 7న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ బడ్జెట్ ప్రతిపాదనలు.. సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్.. ఉద్యోగాల భర్తీ పైన ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాల పైన సమీక్ష తో పాటుగా కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లే విధంగా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications