ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ల పథకాల అమలు ముహూర్తం ఖరారు..!!
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత రూ 4 వేలకు పెన్షన్ పెంచి అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో మరో రెండు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన సమీక్ష చేస్తున్నారు. ఈ పథకం తో పాటుగా మరో హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు సమీక్ష
అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలు అవుతున్న రెండు రాష్ట్రాల్లో తీరు తెన్నుల పైన ఆర్టీసీ అధికారులు నివేదికలు సిద్దం చేసారు. ఏపీలో ఈ పథకం అమలు ద్వారా ఆర్దికంగా పడే భారంతో పాటుగా తీసుకోవాల్సిన చర్యల పైన ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణీకుల సంఖ్య..బస్సుల లెక్కల పైన ఆరా తీయనున్నారు.

ప్రభుత్వం కసరత్తు
కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు సమయంలో కొన్ని ఇతర సమస్యలు తెర మీదకు వచ్చాయి. వాటి పైన చంద్రబాబుకు అధికారులు నివేదించనున్నారు. ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక.. మరో ఎన్నికల హామీగా ఉన్న మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఏడాదికి మూడు సిలిండర్లు ఎంత మందికి ఇవ్వాల్సి ఉంటుందన్న లెక్కలను అధికారులు సిద్దం చేస్తున్నారు.
దసరా నుంచి అమలు
తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం అమలు కానుంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో తెలుపు రంగు రేషన్ కార్డులు కూడా దాదాపు అరవై లక్షలకు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు..మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను దసరా నాడు ప్రారంభించేందుకు ముహూర్తంగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాల పైన నేటి సమీక్షలో చంద్రబాబు కీలక సూచనలు చేయనున్నారు. పథకాల అమలు పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications