ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.. ఎప్పుడంటే ??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన చేయనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో టూర్ కి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి చారిత్రాత్మకంగా నిలిచే ఒక పెద్ద ఒప్పందం కుదరబోతోందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రధాని మోడీతో భేటీ..
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల కేటాయింపులు, పరిశ్రమల పెట్టుబడులు వంటి అంశాలపై చర్చ జరగనుంది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవం..
ఢిల్లీ పర్యటనకు ముందు 13వ తేదీ ఉదయం, ముఖ్యమంత్రి అమరావతిలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి పయనమవుతారు.
రైడెన్-గూగుల్ ఒప్పందం..
అక్టోబర్ 14న ఢిల్లీలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ 'రైడెన్' తో డేటా సెంటర్ ఏర్పాటు పై ఒప్పందం కుదరనుంది. ఈ ప్రాజెక్టు రూ. 84 వేల కోట్ల భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఇది భారతదేశంలోనే అత్యంత భారీ స్థాయిలో ఉండే డేటా సెంటర్లలో ఒకటిగా నిలవనుందని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 3.5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన మౌలిక సదుపాయాల ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రానికి లక్షలాది ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమల వృద్ధి.. టెక్నాలజీ మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
విశాఖలో మూడు క్యాంపస్లు..
ఈ మేరకు విశాఖ జిల్లాలోని తర్లువాడ, అచ్యుతాపురం, అడవివరం సమీపంలోని రాంబిల్లి ప్రాంతాల్లో మూడు విస్తృతమైన క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ డేటా సెంటర్లు భవిష్యత్తులో విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్తో నేరుగా అనుసంధానమవుతాయని స్పష్టం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ స్థాయి డిజిటల్ గేట్వేగా అవతరించేందుకు దోహదపడనుంది.












Click it and Unblock the Notifications