సింహాచలం ఆలయంలో భక్తుల దుర్మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
Simhachalam temple: ప్రఖ్యాతి చెందిన సింహాచలం ఆలయంలో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వెలిసిన శ్రీ వరాహలక్ష్మీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు.
స్వామివారికి నిర్వహించే వార్షిక చందనోత్సవం వేడుకల సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

సింహాచలం లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రతి సంవత్సరం చందనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో నిజరూప దర్శనం ఇస్తారు. నిజరూప దర్శనం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.
ఈ ఏడాది చందనోత్సవానికి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
300 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూలైన్లో తాజాగా ఈ ప్రమాదం సంభవించింది. తెల్లవారు జామున 3, 3:30 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న 20 అడుగుల గోడ కుప్పకూలింది. విశాఖపట్నం జిల్లాలో రాత్రి ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి పోయింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆలయంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రులను సంఘటనస్థలానికి వెళ్లాలని ఆదేశించారు.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన తనను కలచి వేసిందని చంద్రబాబు అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో ఈ ఘటనలో చోటు చేసుకుందని ఆయన తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
సమాచారం అందిన వెంటనే హోమ్, విపత్తు నిర్వహణ వ్యవహారాల శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆలయానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications