బ్యాంకుల తీరుపై సీఎం చంద్రబాబు గుస్సా...ప్రజలను మోసం చేయొద్దని హెచ్చరిక
Recommended Video
అమరావతి:రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర బ్యాంకుల తీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలే తప్ప..మోసం చేయొద్దని ఆయన సూచించారు.
సిఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వార్షిక రుణప్రణాళిక సీఎం చంద్రబాబు విడుదల చేశారు.అనంతరం మాట్లాడుతూ బ్యాంకర్లు కొన్ని ప్రాంతాలను మాత్రమే పట్టించుకుంటున్నాయని అది ఎంత మాత్రం సరికాదని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సిఎం చంద్రబాబు రాష్ట్ర వార్షిక రుణప్రణాళిక సీఎం విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం మొత్తం వార్షిక రుణప్రణాళిక రూ.1,94,220 కోట్లు, వ్యవసాయ రుణ ప్రణాళిక మొత్తం: రూ.1,01,564 కోట్లుగా ఉంది. అలాగే కౌలు రైతులకు ఆర్ధిక సాయం రూ.7,500 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు రుణాలు రూ.21,323 కోట్లుగా పేర్కొన్నారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ నోట్ల డిపాజిట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉందని, పెద్ద ఎత్తున అపోహలు ప్రచారం జరుగుతున్నాయన్నారు. నోట్ల రద్దు తర్వాత జనం ఇబ్బంది పడుతున్నారని సమావేశంలో పేర్కొన్నారు. ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నామన్నారు. తలసరి ఆదాయం లేని శ్రీకాకుళం లాంటి జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, విజయనగరం ఆదాయం మరీ దారుణంగా ఉందని వెల్లడించారు.
టిడిపి ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో వ్యవసాయంలో సుస్థిర అభివృద్ది తెచ్చిందిని, హార్టికల్చర్కు ప్రాధాన్యతనిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 34% జీఎస్డీపీ వ్యవసాయం నుంచే వస్తోందని చెప్పారు. పారదర్శకత పాటిస్తూ అన్నీ ఆన్లైన్లో ఉంచుతున్నామన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్తో పారదర్శకత తెచ్చామని బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు.