చంద్రబాబు పేల్చిన జోక్ : విరగబడి నవ్విన నేతలు
విజయవాడ : ఎప్పుడూ సీరియస్ గానే కనిపించే ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేయడమే తప్ప ఛలోక్తులు.. సెటైర్ల జోలికి పెద్దగా వెళ్లరు. ఉపన్యాసాలైనా పార్టీ మీటింగులైనా ఆయనది ఇదే తీరు. అయితే చుక్క తెగిపడ్డట్లుగా ఎప్పుడో ఓసారి అరుదుగా ఆయన నోటి వెంట జోక్స్ పేలుతుంటాయి. ఈమధ్యే చంద్రబాబు పేల్చిన ఓ జోక్ పార్టీ వర్గాల్లో నవ్వులు పూయించినట్లు సమాచారం.
ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టే సీఎం చంద్రబాబు కొద్దిరోజుల క్రితమే ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన విషయం తెలిసిందే. అయితే సర్వేలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంత్రుప్తి చేసిన చంద్రబాబు ఆ తర్వాత సదరు ఎమ్యెల్యేల పనితీరును పర్యవేక్షించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేల్లో సర్వే ఎఫెక్ట్ వల్ల మార్పు రావడంతో పాటు సీఎం ఏర్పాటు చేసిన కమిటీ వారి పనితీరు పట్ల సంత్రుప్తిని వ్యక్తపరుస్తూ సీఎం చంద్రబాబు నివేదిక అందించింది. రష్యా పర్యటన నుంచి వచ్చిన తర్వాత పనితీరు మెరుగుపరుచుకున్న ఆ 25 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని సమావేశం ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు.
సమావేశంలో భాగంగా విదేశాల్లో తాను పరిశీలించి వచ్చిన కోర్ డ్యాష్ బోర్డుల గురించి ప్రస్తావించారట చంద్రబాబు. ఈ విధానంలో ఆసుపత్రులను ఇన్ పేషెంట్ వార్డులతో అనుసంధానం చేసి ఏ రోగి ఏ జబ్బుతో ఉన్నారో సులువుగా గుర్తించవచ్చునని ప్రయోగాత్మకంగా చూపించారట.
ఆ జోక్ ఇదే :
ఇదే విషయానికి సంబంధించి ఏపీ ప్రస్తావన కూడా తీసుకొచ్చిన చంద్రబాబు కోర్ డ్యాష్ బోర్డు ద్వారా ఏపీలో పేషెంట్ల గురించి పరిశీలించి.. కిర్లంపూడిలో బీపీ పేషెంట్లు, నల్లజర్లలో షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది ఆసుపత్రులకు వస్తున్నారని సదరు ఎమ్మెల్యేలకు చెప్పారట చంద్రబాబు.
ఇదే సందర్భంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వగ్రామమైన "కిర్లంపూడిలో బీపీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని" సీఎం చంద్రబాబు సెటైర్ వేయడంతో అక్కడున్న ఎమ్మెల్యేలంతా విరగబడి నవ్వారట. అయితే సీఎం చంద్రబాబు మాత్రం తన ముసి ముసి నవ్వులతోనే విషయాన్ని ముగించారని సమాచారం.












Click it and Unblock the Notifications