చంద్రబాబు ధీమా అదే..
Vice President of India: ఉపరాష్ట్రపతి ఎన్నిక గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశరాజధానిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎన్డీఏ- ఇండియా బ్లాక్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు నల్లేరు మీద నడకే.
ఆరోగ్య కారణాల దృష్ట్యా ధన్ ఖర్ కిందటి నెలలో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది. ఆయన రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది ఈసీ.

ఇప్పటికే రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. వారిని గెలిపించుకోవడానికి తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఇతర నాయకులకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ పరిస్థితుల మధ్య ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో సీపీ రాధాకృష్ణన్ తో సమావేశం అయ్యారు. మర్యాదపూరకంగా ఆయనను కలిశారు. ఆ సమయంలో ఆయన వెంట.. టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఉన్నారు.
అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాము గెలుస్తామని విపక్షాలు ఎలా ఆశించగలరని ప్రశ్నించారు. కూటమిలో కొనసాగుతున్నప్పుడు మరో అభ్యర్థికి మద్దతు ఇస్తారని అనుకోవడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. తెలుగు సమాజం కోసం తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు.
అయిదు దశాబ్దాల కాలంలో తాము ఎంతో విశ్వసనీయతను ప్రజల్లో పెంపొందించుకున్నామని, తన వైఖరి, ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీ గురించి దేశ ప్రజలకు తెలుసునని చంద్రబాబు పేర్కొన్నారు. సీపీ రాధాకృష్ణన్ ఎంతో మంచి వ్యక్తి అని, ఆయనకు అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్కు సీఎం చంద్రబాబు మద్దతు తెలిపారు.#CBNInDelhi #ChandrababuNaidu pic.twitter.com/YmEGFB5SCR
— Telugu Desam Party (@JaiTDP) August 22, 2025
ఉపరాష్ట్రపతి అనేది చాలా గౌరవప్రదమైన పదవి కావడం వల్ల, ఈ ఎన్నికల్లో రాజకీయాలు చేయకూడదని చంద్రబాబు అన్నారు. విపక్షాలు మరో అభ్యర్థిని పోటీకి దించడం సరికాదని, ఇక్కడ పోటీ అవసరమా? అని అన్నారు. ఈ ఎన్నికల్లో విపక్షాలు రాజకీయం చేయడం సరికాదని అన్నారు. తమకు సంపూర్ణ మెజారిటీ ఉందని, సీపీ రాధాకృష్ణన్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications