కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు, సీఎం కీలక ప్రకటన
దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కీలక సమావేశానికి హాజరయ్యారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం అధ్యక్షతన 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ (SLBC) సమావేశాలు నిర్వహించారు. విదేశీ పర్యటన నుంచి వచ్చినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా నేరుగా సమావేశానికి హాజరుకావడం గమనార్హం.
ఈ సమావేశాల్లో రాష్ట్రంలోని వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, గృహ నిర్మాణ రంగం తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా కౌలు రైతులకు పెద్ద ఎత్తున మద్దతు లభించినట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులకు రూ.1,490 కోట్ల మేర వ్యవసాయ రుణాలు అందించినట్లు బ్యాంకర్లు సీఎంకు వివరించారు. రైతాంగానికి బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎంఎస్ఎంఈ రంగానికి కూడా బ్యాంకులు గణనీయమైన మద్దతు అందిస్తున్నాయని సమావేశంలో వెల్లడైంది. ఇప్పటి వరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.95,714 కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు బ్యాంకర్లు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు.
రాజధాని అభివృద్ధిలో..
రాజధాని అమరావతిని ఫైనాన్షియల్ హబ్గా తీర్చిదిద్దే అంశంపైనా సీఎం బ్యాంకర్లతో చర్చించారు. అమరావతిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణలో బ్యాంకుల పాత్ర, ఆర్థిక సంస్థల భాగస్వామ్యం వంటి అంశాలపై సమాలోచనలు జరిగాయి. రాజధాని అభివృద్ధిలో బ్యాంకులు క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని సీఎం సూచించారు.
ఫైనాన్షియల్ సపోర్ట్..
అలాగే ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల బ్యాంక్ లింకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకుల సహకారం, స్టార్టప్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ వంటి అంశాలపై కూడా సమీక్ష జరిగింది. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వంతో పాటు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు.
ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డ్ జీఎం, వివిధ జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ సమావేశం కీలక దిశానిర్దేశం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications