రూ.10 పెన్షన్: చంద్రబాబు బిగ్ మిస్టేక్
Chandrababu Naidu: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే.. సీఎంఓ అధికారుల బాధ్యతారాహిత్యం వెలుగులోకి వచ్చింది. అధికారిక ఎక్స్ హ్యాండిల్లో అతి పెద్ద పొరపాటు చేసింది. దీని పర్యవసానం- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. చంద్రబాబు ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకోవడానికి అవకాశం ఇచ్చినట్టయింది.
అసలు కథేమిటంటే- కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ దివ్యాంగురాలైన తన కుమార్తె సాయి లక్ష్మీచంద్రతో కలిసి వెలగపూడి సచివాలయంలో శుక్రవారం చంద్రబాబును కలిశారు. వెన్నెముకలో కణితి కారణంగా తన కుమార్తె అనారోగ్యానికి గురైందని వివరించారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పటికీ- గత ప్రభుత్వం తనను ఇక్కట్లపాలు చేసిందని అన్నారు.

అమలాపురంలో ఉన్న తన స్థలాన్ని విక్రయించడంలో ఇబ్బందులు పడుతున్నానని, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆరుద్ర వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా ఎవరూ స్పందించలేదని ఫిర్యాదు చేశారు. తనపై ఎదురు కేసులు పెట్టారని వాపోయారు.
ఆరుద్ర సమస్యలను అసాంతం విన్న చంద్రబాబు ఆమెకు అభయం ఇచ్చారు. సాయి లక్ష్మీచంద్రకు అప్పటికప్పుడు అయిదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే- ప్రతి నెలా 10,000 రూపాయల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వపరంగా ఎంత వరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి, అండగా ఉంటామని చెప్పారు.

దీనికి సంబంధించిన కొన్నిఫొటోలు, సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తమ అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ- 10 వేల రూపాయల పింఛన్ మొత్తాన్ని పొరపాటున 10 రూపాయలుగా రాశారు. నెలకు రూ.10 పింఛను అందించాలని ఆదేశించారు... అంటూ అందులో పొందుపరిచారు.
కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంత వరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. సిఎం శ్రీ చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన భరోసాతో ఆరుద్ర, ఆమె కుమార్తె సంతోషం వ్యక్తం చేశారు. (2/2) pic.twitter.com/Z9bAs7ERTb
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 14, 2024
శుక్రవారం రాత్రి 11:42 నిమిషాలకు ఇది @AndhraPradeshCM హ్యాండిల్లో పోస్ట్ అయింది. ఇప్పటికీ అదే పోస్ట్ కనిపిస్తోంది. దీన్ని ఇంకా సరిదిద్దుకోలేదు సీఎంఓ అధికారులు. చంద్రబాబు బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే ఇలాంటి పొరపాటు చోటు చేసుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. అటు వైఎస్ఆర్సీపీ కూడా సోషల్ మీడియా ద్వారా ఈ ట్వీట్ను వైరల్ చేసింది.












Click it and Unblock the Notifications