ఎమ్మెల్యే కావాలని అప్పుడే నిర్ణయించుకున్నా: చంద్రబాబు, 34లక్షల ఉద్యోగాలు, గేట్స్ను రప్పించా!
విశాఖపట్నం: జీవితంలో అన్నింటి కంటే విద్యార్థి దశ కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ ఆంధ్రావర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు ప్రసంగించారు.
ఎమ్మెల్యే కావాలని అప్పుడే..
విద్యార్థి దశ చాలా కీలకమని, విద్యార్థి దశలోనే లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించుకోవాలని చంద్రబాబు సూచించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే తాను ఎమ్మెల్యే కావాలని సంకల్పించుకున్నట్లు ఆయన తెలిపారు.
బిల్ గేట్స్ను రప్పించా..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్గేట్స్కు తన విజన్ వివరించి మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్కు వచ్చేలా కృషి చేశామని చంద్రబాబు చెప్పారు. మీరు మీ లక్ష్యాలను అందిపుచ్చుకోవడానికి అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫలితాలు వచ్చే వరకూ కష్టపడాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.
34లక్షల ఉద్యోగాలు..
యువత ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు గణనీయంగా పెంచామని చంద్రబాబు తెలిపారు. ఐటీ అస్సలు లేని స్థాయి నుంచి 17శాతానికి తీసుకురాగలిగామని చెప్పారు. పలు కంపెనీలతో రూ.16లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వచ్చే నాలుగేళ్లలో 34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పారు.
కేంద్రం సహకరించకున్నా.. రాజీలేదు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గ్రామాల్లోనూ 25వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశామని చెప్పారు. ఎల్ఈడీ బల్బుల వినియోగంతో రూ.40కోట్ల మేర విద్యుత్ మిగులు సాధించామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఎలాంటి సహాయం అందించడం లేదని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీపడటం లేదని అన్నారు.