ఉద్యోగం చేసే మహిళలకు ఎదురు కట్నం ఇచ్చి మరీ 'పెళ్లి': చంద్రబాబు
మహిళలు చదువుకుని ఉద్యోగాలు చేస్తే ఎదురు కట్నాలు ఇచ్చి మరీ వారిని వివాహాలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు.
విజయవాడ: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళలను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు.
మహిళలు చదువుకుని ఉద్యోగాలు చేస్తే ఎదురు కట్నాలు ఇచ్చి మరీ వారిని వివాహాలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. ఆర్టీసీలో 33శాతం కండక్టర్లు పనిచేస్తున్న సంగతిని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. అవకాశం కల్పిస్తే ఎంతటి కఠినమైన రంగంలోనైనా మహిళలు రాణించగలరని అన్నారు.

ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మహిళలతో ఎవరూ పోటీ పడలేరని చంద్రబాబు తెలిపారు. స్త్రీ, పురుష సమానత్వంకు అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే అని గుర్తుచేశారు.
రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు మరింత బలోపేతం కావాలన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించాలని ఆకాంక్షించారు. వేరే రాష్ట్రాలు ముందుకు రాకపోతే వచ్చే ఏడాది కూడా మహిళా పార్లమెంటు సదస్సును విజయవాడలోనే నిర్వహిస్తామని చంద్రబాబు అన్నారు. ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు గురించి ప్రస్తావిస్తూ.. బెజవాడలో పుట్టిన సింధు అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు.












Click it and Unblock the Notifications