అక్టోబర్ 2 నుంచి స్వచ్ఛ ఆంధ్ర: ప్రధానిని కలిసి త్వరలో నివేదిక
అమరావతి: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను రాజకీయాలకు అతీతంగా పవిత్ర కార్యక్రమంగా అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. అక్టోబర్ 12వ తేదీ వరకూ ఏపీలో నిర్వహించే ఈ కార్యక్రమానికి గుంటూరు నుంచి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
ప్రతి నెలా రెండో శనివారం అన్ని స్థాయిల్లోనూ జరిగే స్వచ్ఛ ఎపీ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్కు నియమించిన బ్రాండ్ అంబాసిడర్లతో పాటు ధనిక, పేద, వయస్సు, మగ, ఆడ, చదువులు ఇలా ఎందులోనూ ఎలాంటి ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
2016, జనవరి ఒకటో తేదీ నుంచి బహిరంగ మల, మూత్ర విసర్జనపై నిషేధం అమల్లోకి రానున్నట్లు తెలిపారు. సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో కాగితం ముక్క రోడ్డున పడేసినా శిక్షార్హులవుతారన్నారు. అసలు అక్కడ ఇళ్లలో కూడా కాగితం ముక్క కన్పించదంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతగా ఉపయోగించుకుంటున్నారన్నారు.
మంగళవారం రాత్రి తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2019 నాటికి దేశాన్ని స్వచ్ఛ భారత్గా మార్చాలనే ప్రధాని ఆశయానికనుగుణంగా 9 మంది ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ పేరిట ఏర్పాటైన సబ్కమిటీకి తాను కన్వీనర్గా కొనసాగుతున్నానని అన్నారు.
ఇటీవల జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, త్వరలోనే ప్రధాన మంత్రిని కలిసి దీనికి సంబంధించిన నివేదికను అందజేస్తానని అన్నారు. ప్రధానంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, మురుగునీరు శుద్ధి, కూల్చివేసిన కట్టడాల నుంచి రీసైక్లింగ్ ద్వారా ఇసుక, కంకరను వేరు చేసి తిరిగి వినియోగించుకోవటం వంటి సిఫార్సులున్నాయని తెలిపారు.
స్వచ్ఛ భారత్కు కేంద్రం నుంచి 75 శాతం నిధులు వస్తే రాష్ట్రాలు 25 శాతం భరించాల్సి ఉన్నాయన్నారు. ఈ నిధుల సమీకరణ కోసం పెట్రోల్, డీజిల్ సహజ వాయువులపై సర్చార్జి విధించాలంటూ కూడా సిఫార్సు చేశామన్నారు.
చెత్తను సేకరించి విద్యుత్ను ఉత్పత్తి చేయడం, అధిక మోతాదులో వస్తే దాన్ని ఎరువుగా మార్చి సబ్సిడీపై సరఫనా చేసేందుకు ఓ కార్పొరేషన్ను, బ్యూటిఫికేషన్ గార్డెన్స్ కోసం మరో కార్పొరేషన్ను ప్రారంభించబోతున్నామని, ఈ రెండు సంస్థలు ముఖ్యమంత్రి పర్యవేక్షణలో పనిచేస్తాయని అన్నారు. ఔట్సోర్సింగ్లో విదేశీయుల నుంచి కూడా సేవలను వినియోగిస్తామన్నారు.
ఈ దేశంలో మొట్టమొదట తాను గతంలో క్లీన్ అండ్ గ్రీన్ నినాదాన్ని తీసుకువచ్చానని అన్నారు. ప్రతి నెల రెండో తేదీ జరిగే స్వచ్ఛ ఎపిలో మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులందరూ తమతమ ప్రాంతాలు లేదా దత్తత గ్రామాల్లో విధిగా పాల్గొనాల్సి ఉందన్నారు. 11 నెలల అనంతరం 2016, అక్టోబర్లో గ్రామ స్థాయి నుంచి రేటింగ్, గ్రేడ్లు ప్రకటించి అవార్డులు అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమాలు రాజకీయాలకతీతంగా జరగాల్సి ఉందని, మనిషిగా ఉన్నంత వరకు సామాజిక బాధ్యతగా స్వీకరించి చేపట్టాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 2 లక్షల, 29 వేల, 790 గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించాలనే లక్ష్యం కాగా లక్షకు పైగా మంజూరు చేశామని వీటిల్లో 50 వేలు దొడ్ల నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రైవేట్ భాగస్వామ్యంతో జిల్లా కో ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నామన్నారు.
ముందుగా రాష్ట్రంలోని 659 మండలాల్లో కనీసం 100 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలనేది తన లక్ష్యంగా చెప్పారు. స్వచ్ఛ ఎపికి జాతీయ స్థాయిలో కొన్ని సంస్థల ప్రతినిధులతో ప్రచార కార్యక్రమం చేపట్టనున్నామని, దీనికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ కూడా బాధ్యులుగా ఉంటారని సిఎం చెప్పారు.