అంతర్జాతీయ నేతల సరసన చంద్రబాబు: సింగపూర్ వేదికగా ఏపీ సత్తా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో రెండవ రోజు అత్యంత బిజీగా గడిపారు. అటు అంతర్జాతీయ వేదికలపై ఏపీ అభివృద్ధి నమూనాను చాటిచెబుతూనే, ఇటు రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. లీడర్షిప్ సదస్సుల నుంచి పారిశ్రామిక రౌండ్ టేబుల్ సమావేశాల వరకు చంద్రబాబు మార్క్ దార్శనికత సింగపూర్ వేదికగా మరోసారి ప్రపంచానికి పరిచయమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో 'సీబీఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్' (CBN@361 Degrees) ఆంగ్ల పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక తొలి ప్రతులను సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి నారాయణలకు సీఎం అందజేశారు. 'రేపటికోసం' దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించిన ఈ పుస్తకాన్ని విశ్రాంత ఐఏఎస్ కేవీ సత్యనారాయణ ఆంగ్లంలోకి అనువదించారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సింగపూర్, న్యూజిలాండ్ మాజీ ప్రధానులు లీ క్వాన్ యూ, జేసిందా ఆర్నాడ్ల తరహాలోనే చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి దార్శనిక నిర్ణయాలు తీసుకుంటారని, అమరావతి రాజధాని నిర్మాణమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని రచయిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శతజయంతి వెండి నాణేన్ని సీఎంకు అసోసియేషన్ ప్రతినిధులు బహూకరించారు. త్వరలోనే ఈ పుస్తకం తెలుగు, హిందీ భాషల్లో రానుండగా, దీని పూర్వ భాగమైన 'చంద్రబాబు X.0' పుస్తకం సాఫ్ట్ కాపీ ఇప్పటికే 8 మిలియన్ల (80 లక్షలు) మేర డౌన్లోడ్ కావడం విశేషం.
సెమీకండక్టర్ల తయారీకి ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. రాయలసీమలో సరికొత్త విప్లవం
సింగపూర్లో జరిగిన 'సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్' సదస్సులో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ఆయన స్పష్టం చేశారు. "భారతదేశం పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతం.. అందులో ఏపీ అత్యంత అనుకూల రాష్ట్రం. మా వద్ద ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు.. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నడుస్తోంది. కేవలం 30 రోజుల్లో ఏపీకి వచ్చి మా పాలసీలను పరిశీలించండి" అంటూ గ్లోబల్ ఫౌండ్రీస్, ఎన్ఎక్స్ పీ, ఒన్ సిస్టమ్స్ వంటి ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ దిగ్గజాలకు సీఎం పిలుపునిచ్చారు. త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో ఒక భారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని, ఆటోమొబైల్, డిఫెన్స్, ఏరోస్పేస్ మరియు ఫైటర్ జెట్ల తయారీకి రాయలసీమను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ప్రకటించారు.
వరల్డ్ సిటీస్ సమ్మిట్: 'నాడు సైబరాబాద్.. నేడు అమరావతి'
సింగపూర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక 'వరల్డ్ సిటీస్ సమ్మిట్' లీడర్షిప్ ప్లీనరీలో సీఎం చంద్రబాబు 'కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్' అనే అంశంపై ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. "25 ఏళ్ల క్రితమే నేను ఐటీ గురించి మాట్లాడాను.. నాడు సైబరాబాద్ను అభివృద్ధి చేస్తే నేడు తెలంగాణకు అదే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. నాడు సైబరాబాద్లో ఎకరం రూ. 2 లక్షలు ఉంటే నేడు రూ. 200 కోట్లకు పెరిగింది. సంపద సృష్టికి అదే నిదర్శనం" అని గుర్తుచేశారు.
రాష్ట్ర విభజన తర్వాత లభించిన అవకాశంతో అమరావతిని అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీగా, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామని వివరించారు. "పీపుల్ ఫస్ట్ (ప్రజలే ప్రథమం) అనేది మా విధానం. నా ఒక్క పిలుపుతో అమరావతి కోసం రైతులు 35 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు. కృష్ణా నది ఒడ్డున 21 కిలోమీటర్ల పొడవునా వాటర్ ఫ్రంట్ సిటీగా, క్వాంటం కంప్యూటింగ్ హబ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అమరావతి రూపుదిద్దుకుంటోంది" అని సీఎం తెలిపారు.
స్పోర్ట్స్, ఫైనాన్స్, నాలెడ్జ్, జస్టిస్, హెల్త్ వంటి గ్లోబల్ కాన్సెప్ట్స్తో పాటు వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, గ్రీన్ ఎనర్జీ, నెట్-జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యంగా అమరావతి నిర్మాణం సాగుతోందని, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు అమరావతిని సందర్శించి ఇక్కడి అవకాశాలను వాడుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications