అవిశ్వాసంతో ఉపయోగం లేదు... ప్రధాని మోడీ వస్తే ఇబ్బందే: చంద్రబాబు
Recommended Video

విజయవాడ:కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అనగానే చంద్రబాబు వెనక్కి తగ్గారా?...అవిశ్వాస తీర్మానం విషయంలో తాము ముందుండి లీడ్ తీసుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టం లేదా?...అంటే అవుననే చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.
సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని తేల్చేసిన చంద్రబాబు, మళ్లీ విజయవాడ 'మాదిగ మహాసభ' కు హాజరైన సందర్భంగా...తప్పనిసరి అయితే కేంద్రంపై అవిశ్వాసం పెడతామని, అయితే అది చిట్టచివరి చర్యగా ఉండాలనేదే తన అభిమతమని స్ఫష్టం చేశారు.
అయితే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎంపీల సంఖ్య కూడా సరిపోదనేవిధంగా చంద్రబాబు మాట్లాడారు. అలాగే రాష్ట్రానికి ప్రధాని మోడీ రాక విషయమై స్పందిస్తూ ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, మోడీ ఈ సమయంలో రావడం ఇబ్బందేనన్నారు.

అవిశ్వాసంపై చంద్రబాబు...తాజా వ్యాఖ్యలు
ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అంటున్నారు కదా...ఆ విషయమై మీ వైఖరి ఏమిటనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ పర్యటన సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలనడానికి జగన్కి తలాతోక లేదని చంద్రబాబు విమర్శించారు. అయినా అవిశ్వాసం పెట్టాల్సివస్తే ఆ విషయంలో తాను లీడ్ తీసుకుంటాననీ దీనికి ప్రతిపక్షం సహకరించాలని, అంతేగానీ జగన్ నేను వస్తాను...మీరు నా వెనుక రండి అనడంలో ఆంతర్యమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు.

అవిశ్వాస తీర్మానం వద్దు...పోరాటమే ముద్దు:చంద్రబాబు
ప్రత్యేక హోదా, విభజన హామీలు పోరాడి సాధించుకోవాలి తప్ప...ఈ సమయంలో రాజీనామాలు చేసేసి వస్తే, పార్లమెంట్లో పోరాడే వ్యక్తులు కూడా ఉండరని చంద్రబాబు అన్నారు. అసలు అవిశ్వాస తీర్మానం చేస్తే మెజార్టీ ఎవరికి ఉందో తెలుసుకోవాలనీ...మెజారిటీ ఉన్నాక అవిశ్వాసం పెడితే ఆరునెలలు మళ్లీ ఆ విషయంపై అసలు మాట్లాడే అవకాశం కూడా ఉండదని చంద్రబాబు గుర్తుచేశారు.అయినా అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది చిట్టచివరి చర్యగా ఉండాలన్నారు. మనకు 54 మంది ఎంపీలు ఉంటే తప్ప అవిశ్వాసం పెట్టలేమని, అలాంటప్పుడు అవసరమైతే కొన్నిపార్టీ ఎంపీల సహకారం తీసుకుని న్యాయం జరిగే వరకు గట్టిగా పోరాడాలే తప్ప రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు.

అప్పుడు కాంగ్రెస్...ఇప్పుడు బిజెపి...తీరని అన్యాయం...
విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, అయితే ఇప్పుడు బిజెపి కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"29సార్లు ఢిల్లీ వెళ్లా, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చర్చించా. సమస్యలు పరిష్కరించాలని కోరా. రెండు గంటలు కేటాయించమని ప్రధానికి విజ్ఞపి చేశా. అయినా, పనేలేవి కాలేదు' అని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. 'పునర్ వ్యవస్థీకరణ చట్ట ప్రకారం నిధులు ఇవ్వాలని మేం కోరుతుంటే...వారు ఉపాధి హామీ నిధుల గురించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెనం మీద నుంచి పొయ్యి లోకి...అప్పుడు ఏదైనా ఒకే
"విభజన చట్టంలో ఉన్నవి బిజెపి నేతలు ఏం చేశారో చెప్పాలి...14వ ఆర్థిక సంఘం సూచన మేరకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక సాయం ద్వారా అవే ప్రయోజనాలు ఇస్తామని బిజెపి నాయకులు చెబితే ఒప్పుకున్నా...కానీ ఆ ప్రయోజనాలు కూడా ఇవ్వలేదు"...అని చంద్రబాబు చెప్పారు.
బిజెపి అనుసరిస్తున్న ఈ విధానాలతో రాష్ట్ర ప్రజల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డట్టయిందని చెప్పారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక సాయం ఏదిచ్చినా సంతోషమేనన్నారు..."పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలు అమలు చేయాలి. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నేరవేర్చాలి. అప్పుడు ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి ఏదిచ్చినా అంగీకారమే" అని అన్నారు.

చేస్తే చెయ్యండి...లేకపోతే మానేయండి...
రాష్ట్రానికి కేంద్రం ఎంతో మేలు చేసిందని, ఎన్నో నిధులను ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారనీ, అయితే విభజన సమయంలో పార్లమెంటులోనూ, రాజ్యసభలోనూ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసిందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సీట్ల పెంపు విషయం గురించి బిజెపి నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
అసలు సీట్ల పెంపు విషయం తానెప్పుడూ మాట్లాడలేదని...చేస్తే చేయండి.. లేకపోతే మానేయండి...అంటూ ఆ విషయం గురించి తాను పట్టించుకోలేదన్నారు. అయితే అది కూడా చట్టంలో ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేకహోదా విషయంలో తాను రాజీపడ్డట్టు వస్తున్న విమర్శలను చంద్రబాబు తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు.












Click it and Unblock the Notifications