టిడిపి నేతల్నీ వదలొద్దు: 'కాల్ మనీ'పై బాబు సీరియస్, వారు విదేశాలకు పరార్!
విజయవాడ: కాల్ మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని వారికి డబ్బిచ్చి.. రూ.5 నుంచి రూ.35 వరకు వడ్డీ వసూలు చేస్తున్న కాల్ మనీ దందా కుదిపేస్తోంది.
ఈ కేసులో బాధితులమని చెబుతూ... విజయవాడ టాస్క్ఫోర్స్ స్టేషన్లకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం పలువురు స్టేషన్కు వచ్చి తాము కాల్ మనీ బాధితులమని చెబుతున్నారు.
ఈ కేసులో తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని, కేసు వెనుక ఉన్న వారి పేర్లను తెలియజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలుస్తోంది. కాల్ మనీ వ్యవహారం శనివారం రాత్రే చంద్రబాబు ఆరా తీశారు.

కాగా, ఆదివారం ఉదయం డబ్బు చెల్లించని వారిపైకి బౌన్సర్లను పంపుతామని కొందరు బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పక్క రాష్ట్రాలకు, విదేశాలకు కొందరు పారిపోయారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
కేసులో ప్రధాన నిందితులైన యలమంచిలి రాము, భవానీ శంకర్లు డబ్బులు సకాలంలో ఇవ్వని వారిని ఓ ఇంట్లో నిర్బంధించి హింసించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కొందరు నేతల ప్రమేయం ఉన్నట్టు వార్తలు వస్తుండటంతో కాల్ మనీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
అన్ని పార్టీల వారు ఉన్నారని చెబుతున్నారు. కేసులో కొందరు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని కొందరు రాజకీయ ప్రముఖులు విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది. కేసులో ఇంకా ఎవరి పేర్లు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
కాల్ మనీ వ్యవహారంపై సీఎం సీరియస్గా ఉన్నారు: దేవినేని
కాల్ మనీ వ్యవహారం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఉన్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం చెప్పారు. దోషులు ఎంతటి వారినైనా వదిలేది లేదన్నారు. టిడిపి నేతలకు సంబంధముంటే కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు.
చెప్పకుండా వెళ్లాడు: ప్రసాద్
కాల్ మనీ రాకెట్లో కృష్ణా జిల్లా పెనమలూరు టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చిక్కుకున్నట్టు కనిపిస్తోంది.ఈ కేసులో కీలక నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్తో కలసి బోడె ప్రసాద్ విదేశాలకు వెళ్లినట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారని వార్తలు వస్తున్నాయి.
ఆయన ఓ టెలివిజన్ చానల్తో మాట్లాడుతూ... తాము ఇద్దరమూ కలిసి విదేశాలకు వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే, కాల్ మనీ కేసు బట్టబయలైన తర్వాత శ్రీకాంత్ తనకు చెప్పకుండా వెళ్లిపోయాడన్నారు. శ్రీకాంత్ మరో దేశానికి వెళ్లి ఉండవచ్చని, ఆ సమాచారం తనకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications