జగన్తో జాగ్రత్త అంటున్న సీఎం చంద్రబాబు.. నేతలకు దిశానిర్దేశం
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగన్ తో జాగ్రత్తగా ఉండాలని... ఆయన కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
అంతే కాకుండా వివేకా హత్య, కోడికత్తి ఇష్యూ గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఆనాడు మనం అప్రమత్తంగా లేక ఎన్నికల్లో నష్టపోయామని వివరించారు. అప్పటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఆ కుట్రలను పసిగట్టలేకపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలానే ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్రకోణం ఉందని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన ప్రమాదంపై సీసీ కెమెరా ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో, టీడీపీ నేతలు ఏమరుపాటుగా ఉండొద్దని సూచించారు.

ఇక టీడీపీ ఎమ్మెల్యేలకు సైతం చంద్రబాబు గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. నేతల పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని.. పార్టీ నిర్మాణంపై నేతలు దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని వదిలేస్తే అందరం మునుగుతామంటూ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీని నిర్లక్ష్యం చేయవద్దని చంద్రబాబు హితబోధ చేశారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలపై ఫోకస్ పెట్టాలని నేతలకు సూచించారు.
అదే విధంగా ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అనవసరమైన విషయాలను మాట్లాడి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు హెచ్చరించారు. ఎమ్మెల్యేలు పొరపాటు మాట్లాడితే ప్రతిపక్షం అవకాశంగా మలుచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలకు, కేడర్కు, ప్రజలకు మధ్య సమన్వయం కొరవడిందన్న చంద్రబాబు.. సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని సమస్యను అధిగమించాలని పిలుపునిచ్చారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే వారి పని తీరులో మార్పు రావాలని సూచించారు.
మరోవైపు కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ ప్రజలకు అందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళే బాధ్యత ఎమ్మెల్యేలదే అని ఆయన స్పష్టం చేశారు. ఇక నియోజకవర్గాలలో దెబ్బతిన్న రోడ్లకు రెండు నెలల్లో మరమ్మత్తులు పూర్తి చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications