బీజేపీ దాడి, దెబ్బకొట్టేందుకు జగన్-కేసీఆర్: బాబు వ్యూహరచన
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి సమన్వయ కమిటీ గురువారం సమావేశమైంది. ఈ సమావేశంలో విజయవాడలో ఆలయాల కూల్చివేత, బీజేపీ ఆగ్రహం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీకొట్టాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరు, రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ సంస్థాగత అంశాలపై సమావేశంలో చర్చించారు.
గవర్నర్తో ముఖ్యమంత్రి సుదీర్ఘ భేటీకి సంబంధించిన అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయంపై సమావేశంలో చర్చించారు. ఏపీలో రేపటి నుంచి వైసిపి 'గడప గడపకూ వైసిపి'ని ప్రారంభించనుంది. దీనిపై ఎలా ముందుకెళ్లాలని చర్చించారని తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ఏం చేయలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైసిపి చెబుతోంది. దీనిని రేపటి నుంచి అయిదు నెలల పాటు ప్రజల్లోకి తీసుకు వెళ్తామని చెబుతున్నారు. వైసిపి వ్యూహం పైన ఎలా ముందుకెళ్లాలనే విషయమై టిడిపి సమన్వయ కమిటీ భేటీలే చర్చించారని తెలుస్తోంది.
ప్రభుత్వం పథకాలు, అమలు చేసిన హామీలను అదే రీతిన ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం రెండేళ్లు పూర్తి చేసుకుంది. బాబు ప్రభుత్వంపై విపక్షాలతో పాటు మిత్రపక్షం కూడా అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అవినీతిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని వైసిపి చెబుతోంది.
బీజేపీ
టిడిపి - బిజెపిలు మిత్రపక్షాలు. అడపాదడపా వారి మధ్య విభేదాలు వస్తున్నాయి. బెజవాడలో పుష్కరాల కోసం 32 ఆలయాలను కూల్చివేయడం బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. ఆలయాల కూల్చివేత బీజేపీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో టిడిపి ఇరుకున పడింది. చంద్రబాబు పార్టీ నేతలకు నిన్న క్లాస్ పీకినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
బెజవాడలో ఆలయాల కూల్చివేత విషయమై పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ... రెండు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని, అలాగే దీనిపై ఆ పార్టీతో సామరస్యంగా ముందుకెళ్లాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణతో..
తెలంగాణ ప్రభుత్వంలో పలు వివాదాలు కొనసాగుతున్నాయి. దీని పైన కూడా చర్చించారని తెలుస్తోంది. నీటి గొడవ, షెడ్యూల్ 9, 10 సంస్థలతో పాటు రెండు రోజులుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గొడవ కొనసాగుతోంది. ఈ విషయాలపై ఆ ప్రభుత్వంతో చర్చలతో ముందుకెళ్లాలని చంద్రబాబు సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే, ఆరోపణలు చేస్తే తీవ్రంగా స్పందించాలని కూడా సూచించారని తెలుస్తోంది.