రూ.249.50 కోట్ల ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలతో ఏపీ వైద్య ఆరోగ్య రంగానికి బిగ్ బూస్ట్!
ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఏపీలోని విజయవాడలో 249కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 9 క్రిటికల్ కేర్ యూనిట్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పాత ఆసుపత్రి వద్ద జరిగింది.
అంతకుముందు ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయి రాష్ట్ర కీలక ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 500 బెడ్లతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్య ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని, సంజీవని ప్రాజెక్టు గేమ్ఛేంజర్గా మారనుందని సీఎం చంద్రబాబు అన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఏపీలో భారీ ప్రాజెక్ట్ లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా చాలామందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో పెను మార్పులకు ఏపీలో పాలనలో కీలక భూమిక పోషిస్తున్న డబుల్ ఇంజిన్ సర్కారే కారణమని అన్నారు. అర్హులైన వారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉందని, 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు.
ఈరోజు సీఎం కేంద్ర మంత్రితో కలిసి ప్రారంభించిన కొత్త క్రిటికల్ కేర్ బ్లాకుల్లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక విభాగాల సేవలు అందుతాయి. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్సకు ఇవి ఉపయోగపడతాయి. కేంద్రం మంజూరు చేసిన 26 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీల్లో 14 ఇప్పటికే పనిచేస్తుండగా, మిగిలినవి కూడా అందుబాటులోకి వచ్చాయి.
దీనితో మైక్రోబయాలజీ, హీమటాలజీ వంటి పరీక్షలు జిల్లా స్థాయిలోనే నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. వ్యాధులను ముందుగానే గుర్తించి వేగంగా వైద్య సేవలు అందించేందుకు ఇవి దోహదపడతాయి. సీఎం ప్రజలను జీవనశైలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలని, యోగా, ప్రాణాయామం చేయాలని సూచించారు. 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ' లక్ష్య సాధనలో వైద్య విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించాలని కోరారు.













Click it and Unblock the Notifications
