'మా నాన్నను ఇక్కడే చంపారు సార్': 17 ఏళ్ల తర్వాత రెంటచింతలకు చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ సీఎం హోదాలో ఆయన జిల్లాలోని రెంటచింతల వచ్చారు. సెప్టెంబరు, 1999లో సీఎంగా ఉన్న బాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెంటచింతల వచ్చి యరపతినేని తరపున ప్రచారం చేశారు.
ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ చంద్రబాబు రెంటచింతల వచ్చారు. గ్రామానికి చేరుకున్న ఆయన వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పైర్లను పరిశీలించి రైతుల్లో ధైర్యం నూరిపోశారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు పర్యటనలో భాగంగా "మీకు గుర్తుందా సార్... మా నాన్న బోయ వెంకటరెడ్డి, ఆయన్ను, మిట్టగుడిపాడు సర్పంచ్ గొట్టం రామకోటిరెడ్డిని ఇక్కడే వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దారి కాచి చంపారు సార్" అని బోయ వెంకటరెడ్డి కుమార్తెలు శ్రీలత, పద్మలు చంద్రబాబుకు వారి ఆవేదనను విన్నవించారు.
దీంతో ఆయన ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురయ్యారు. 2006లో జూన్ 9వ తేదీన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరై రెంటచింతలకు వస్తున్న వీరిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. అనంతరం తమ తల్లి కూలిపనులు చేసి చదివించిందని, ఎమ్మెల్యే యరపతినేని ఆదుకోకుంటే వీధుల్లో పడుండేవాళ్లమని వారు వాపోయారు.
దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు "ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా?" అని చంద్రబాబు అడగ్గా, మోడల్ స్కూల్లో తాత్కాలిక పద్ధతిలో తను, ఫిషరీస్ డిపార్ట్ మెంట్లో చెల్లెలు పనిచేస్తున్నామని శ్రీలత చెప్పడంతో, ప్రయోజకులైనందుకు సంతోషంగా ఉందని, మీ కుటుంబాన్ని తప్పక ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో రెంటచింతల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో వరద ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకువస్తామని సీఎం తెలిపారు. వరదబాధితులకు హుద్హుద్ తరహా సాయం అందిస్తామని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ నూనె ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.95 వేలు, పూరిళ్లకు రూ.3200 పరిహారం అందిస్తామన్నారు. ఆదివారం హెలికాప్టర్ ద్వారా గుంటూరు జిల్లాలోని వరద ప్రభావి ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన సీఎం చంద్రబాబు అనంతరం దాచేపల్లిలో పర్యటించారు. దాచేపల్లికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లకు రూ.10 కోట్లు మంజూరు చేశారు.












Click it and Unblock the Notifications