నీలం సాహ్నీ రాజీనామా-ప్రభుత్వం ఆమోదం-ఏప్రిల్ 1న ఎస్ఈసీగా బాధ్యతలు
ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఆయన స్ధానంలో కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టేందుకు విశ్రాంత సీఎస్ నీలం సాహ్నీ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పంపిన ప్యానెల్లో నీలం సాహ్నీ పేరుకు గవర్నర్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో ఆమె సీఎం జగన్ ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా సమర్పించారు.
ఇప్పటివరకూ సీఎం జగన్ ప్రధాన సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్తో బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీలం సాహ్నీ కొత్త ఎస్ఈసీ కానుండటంతో ఆ పదవిని వదులుకున్నారు ఈ మేరకు నీలం సాహ్నీ పంపిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఆమె కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. మార్చి 31న నిమ్మగడ్డ రాజీనామా తర్వాత ఏప్రిల్ 1న నీలం కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపడతారు.
ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి గతేడాది డిసెంబర్ 31న రిటైర్ అయిన నీలం సాహ్నీని వైసీపీ సర్కార్.. సీఎం జగన్ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆమెను ఆ పదవిలోకి పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో గవర్నర్కు పంపిన ముగ్గురు సభ్యుల ప్యానెల్లో ఆమెను కూడా చేర్చారు. ప్రభుత్వ వినతి మేరకు నీలంకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఆమె కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.