సీమలో సీఎం జగన్ - చంద్రబాబు : అభ్యర్ధుల ప్రకటన : వైసీపీ ప్లీనరీ వేళ..!!
ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటుగా రాజకీయంగా వాతావరణం మరోసారి హీటెక్కనుంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇదే సమయంలో 7,8 తేదీల్లో సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 8 న ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ జన్మదినం సందర్బంగా నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచి మంగళగిరి వద్ద వైసీపీ రెండు రోజుల ప్లీనరీకి హాజరవుతారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పైన క్లారిటీ ఇస్తున్న సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు..అధికారికంగా ప్రకటించకపోయినా... ఖరారు చేస్తూ వస్తున్నారు.
వైసీపీ ప్లీనరీ వేళ.. వ్యూహత్మకంగా
ఇక, సీమ జిల్లాల్లో ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేసి వారికి ప్రజలతో మమేకం అయ్యేలా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటు సీఎం జగన్ సైతం ప్లీనరీ వేదికగా 2024 ఎన్నికల్లో అభ్యర్ధుల ఖరారు పైన కీలక ప్రకటనకు అవకాశం ఉంది. టీడీపీ అధినేత ఈ రోజు నుంచి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జిల్లా మహానాడు, నియోజకవర్గవారీ సమీక్షలు, బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్షో నిర్వహించనున్నారు.మదనపల్లెలో ఈ రోజు జరిగే మినీ మహానాడు కోసం భారీ ఏర్పాట్లు చేసారు. ఇందు కోసం సుమారు 45 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్దం అయింది. సాయంత్రం 4 గంటలకు మదనపల్లె చేరుకుని మినీ మహానాడులో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు మదనపల్లె నుంచి రోడ్డు మార్గాన కలికిరి చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం అక్కడ జరిగే అన్నమయ్య జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు. మదనపల్లి మినీ మహానాడు వేదికగా రాజంపేట ఎంపీ అభ్యర్ధిని ప్రకటిస్తారని సమాచారం.
టార్గెట్ పెద్దిరెడ్డి - టీడీపీ పక్కా ప్లాన్
పెద్దిరెడ్డి తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైన చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా, తాజాగా పార్టీలో చేరిన పారిశ్రామిక వేత్త గంటా నరహరిని ఎంపీ అభ్యర్దిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా.. నియోజకవర్గాల సమీక్షలో రానున్న ఎన్నికల్లో పార్టీ నుంచి అభ్యర్ధులుగా ఎవరుంటారనే దాని పైన సంకేతాలు వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలంలోనూ చంద్రబాబు పర్యటించనున్నారు. పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. ఈనెల 8న చిత్తూరు జిల్లాలోని నగిరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్ షో జరగనుంది.
ప్లీనరీ వేళ కడపకు సీఎం జగన్
రాజంపేట - అన్నమయ్య జిల్లాల్లో వైసీపీ పట్టున్న నియోజకవర్గాల పైన భవిష్యత్ వ్యూహం చంద్రబాబు ఖరారు చేయనున్నారు. ఇక, 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ఈ సమయంలోనే చంద్రబాబు వైసీపీ కంచుకోటల్లో పర్యటించి.. ప్లీనరీ వేళ.. కొత్త రాజకీయానికి తెర తీస్తున్నారు. నాడు మే లో టీడీపీ ఒంగోలులో మహానాడు నిర్వహణ సమయంలో అధికార వైసీపీ సామాజిక న్యాయ యాత్ర పేరుతో మంత్రులు బస్సు యాత్ర చేసారు. ఇప్పుడు చంద్రబాబు కీలక నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని.. వైసీపీ ప్లీనరీ వేళ.. కౌంటర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. దీంతో..ఈ నాలుగు రోజులు ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.