సీఎం జగన్ - చిరంజీవి మీటింగ్ పర్సనల్ : ఇండస్ట్రీ ఏ ఒక్కరిదీ కాదు : మంచు విష్ణు సంచలనం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరోసారి చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు టీం మధ్య గ్యాప్ పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి భేటీ కావటం పైన అంచనా వేసిన విధంగా టాలీవుడ్ నుంచి భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. "మా" అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యల పైన తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశం జరనుంది. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎంతో జరిగిన చర్చల సారాశం.. తీసుకోవాల్సిన నిర్ణయాల పైన వారితో చర్చించనున్నారు. సరిగ్గా ఇదే సమయంలో "మా" అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమా టిక్కెట్ల ధరలు తెలంగాణలో పెంచారు... ఏపీలో తగ్గించారు.. కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారంటూ వ్యాఖ్యానించారు.
ఛాంబర్ నిర్ణయం మేరకే ముందుకు
దీనిపై సినీ పరిశ్రమ ఏక తాటి పైకి రావాలని పిలుపు నిచ్చారు. టికెట్ల ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళదామంటూ విష్ణు సూచించారు. ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రెండు ప్రభుత్వాలుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. తాను దీని పైన విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేనంటూ తేల్చి చెప్పారు. చిరంజీవి గురించి విష్ణు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన లెజెండరీ యాక్టర్ అని...చిరంజీవి, మోహన్ బాబు, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ లు అందరూ కలసి మాట్లాడితే మంచిదే అని విష్ణు వ్యాఖ్యానించారు. రెండు ప్రభుత్వాలు తమను ఎంకరేజ్ చేస్తున్నారని..చర్చలు జరుగుతున్నాయి..కలిసి మెలసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు.
సీఎం - చిరు మీట్ పర్సనల్
టిక్కెట్స్ ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసిందని.. వారు అడిగితే తాము కూడా కలుస్తామని వెల్లడించారు. చిరంజీవి...సీఎం జగన్ కలయిక పర్సనల్ మీటింగ్ అంటూ విష్ణు వ్యాఖ్యానించారు. దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిరంజీవి క్యాంపు ...ఇటు టాలీవుడ్ లోనూ చర్చకు కారణమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా టికెట్లపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసారు. వ్యక్తిగతగా తన నిర్ణయంతో పని లేదన్నారు. ఎవరూ తన అభిప్రాయం అడగడం లేదని వెల్లడించారు. సినిమా టిక్కెట్స్ పై వైఎస్సార్ హయాంలోనే ఓ జీవో వచ్చిందని... దానిపై కూడా చర్చ జరగాలని విష్ణు డిమాండ్ చేసారు. తన పైన విమర్శలు చేస్తున్నారంటే ..తాను పాపులర్ అని అర్దమని విష్ణు వ్యాఖ్యానించారు.
Recommended Video
చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారా
అయితే, సీఎం జగన్ తో చిరంజీవి భేటీ సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించామంటూ మెగాస్టార్ చెబుతూ...తాను సీఎం పిలుపు మేరకే వచ్చానని.. సీఎం సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా మంత్రి పేర్ని నాని సైతం అది ఇద్దరి మధ్య వ్యక్తిగత అంశాలపైన జరిగిన చర్చగా సీఎం జగన్ - చిరంజీవి భేటీ గురించి వ్యాఖ్యానించగా.. ఇప్పుడు విష్ణు సైతం అది పర్సనల్ మీటింగ్ అంటూ తేల్చేసారు. ఇక, దీని పైన ఫిలిం ఛాంబర్ సమావేశంలో చిరంజీవి ఏ రకంగా రియాక్ట్ అవుతారు... పరిశ్రమ పెద్దలతో ఏం చర్చిస్తారు... ఆయన ఒంటరిగా వెళ్లి..సీఎంతో చర్చించటం పైన ఇండస్ట్రీలో ఏ విధమైన స్పందన వస్తుందనేది ఇప్పుడు విష్ణు వ్యాఖ్యలతో మరింత ఉత్కంఠ పెంచుతోంది.