నవరత్నాల్లో సీఎం జగన్ మరో నిర్ణయం - అదనంగా కేటాయింపు : ఎన్నికల టార్గెట్..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పధకం లో అనేక నిర్ణయాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరో అదనపు ప్రయోజనం పైన నిర్ణయించింది. ఈ పధకం కింద ఇంటి నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ ను రూ 235 -240 చొప్పున అందిస్తోంది. అయితే, ఈ మొత్తం సరి పోవటం లేదనే అభ్యర్ధనలు ప్రభుత్వానికి చేరాయి. బయట కొనుగోలు చేయాలంటే రూ 400 వరకు చేరటంతొ ఇబ్బందిగా మారిందంటూ లబ్దిదారులు వాపోతున్నారు.
Recommended Video


అధిక భారం తగ్గించేలా
దీంతో...రాయితీపై మరో 50 బస్తాలను అదనంగా ఇవ్వాలని, ఈ మొత్తాన్ని ఇంటి నిర్మాణ రాయితీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలందరికీ ఇల్లు అంశం పైన శాసనసభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసారు. రాష్ట్రంలో పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు అందజేశామని చెప్పారు. రూ.25 వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించిందని వివరించారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని ప్రకటించారు. ఇళ్ల నిర్మాణాలతో 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రాయితీ రూ.1.80 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం 4 విడతలుగా లబ్ధిదారులకు ఇస్తోంది.

డిసెంబర్ లోగా పూర్తి చేసేందుకు
ఇప్పటివరకు బేస్మెంటు పూర్తయిన తర్వాత మొదటి విడతగా రూ.70వేలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే నిర్మాణం ప్రారంభించేటప్పుడే కొంత మొత్తం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
దీంతో పునాది తవ్విన వెంటనే రూ.15వేలు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బేస్మెంటు పూర్తయ్యాక రూ.55వేలు, రూఫ్ వరకు చేరాక రూ.50వేలు, రూఫ్కాస్ట్ పూర్తి చేశాక రూ.30వేలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత చివరి విడతగా రూ.30వేల చొప్పున ఇవ్వనుంది. తొలి దశ నిర్మాణాలు ఈ ఏడాది డిసెంబర్ కు పూర్తి చేయాలని నిర్ణయించారు.

వైపీపీ భారీ అంచనాలు
ఇళ్ల నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేదల ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీలు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. అందులో భాగంగానే..ఇప్పుడు వారి పైన భారం తగ్గించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ పధకం ఓట్ల పైన ప్రభావం చూపిస్తుందనే అంచనాల్లో వైసీపీ నేతలు ఉన్నారు.












Click it and Unblock the Notifications