సీఎం జగన్ విసిరిన పాచిక...ఆ 25మంది ఎమ్మెల్యేలు..?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు ప్రారంభించారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఈ ఏడాది చివరలో ఒక స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన కూడా ముందస్తు వస్తే ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

నివేదికలు క్రోడీకరించుకొని..
రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఐప్యాక్ సర్వేతోపాటు పలురకాల ఏజెన్సీల నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని వాటన్నింటినీ క్రోడీకరించుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీకి మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే మద్దతిస్తుండటంతో ఈ సంఖ్య 156కి చేరింది.

స్వయంగా మాట్లాడనున్న జగన్
వీరిలో కొంతమందిని జగన్ ప్రత్యేకంగా కోట్ చేశారని, వీరి నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా వారి ప్రాబల్యం ఉంటుందని, బలహీనంగా ఉన్న స్థానాల్లో, టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో వైసీపీ గెలుపు కోసం వీరి సేవలు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. సంబంధిత ఎమ్మెల్యేలను పిలిపించి స్వయంగా మాట్లాడాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు.

విడివిడిగా సమావేశమవబోతున్న ముఖ్యమంత్రి
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాలుండగా పైన పేర్కొన్న ఎమ్మెల్యేలు 25 మంది ఉంటారని, ఆ 25 మందితో జగన్ విడివిడిగా సమావేశమవబోతున్నారని పార్టీవర్గాలు వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీ కంచుకోటలను బద్ధలు కొట్టాలంటే వీరిని ఉత్తేజితం చేయాలని, ఆయా నియోజకవర్గాల్లో వీరి వ్యూహాలను అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఆ 25 మంది ఎవరనేది జగన్ బహిర్గతపరచలేదు. కానీ ఇప్పటికే వారు ఏం చేయాలి? వీరు పనిచేయాల్సిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలమెంత? గత ఎన్నికల్లో జనసేనకు ఎన్ని ఓట్లు పడ్డాయి? ప్రభుత్వ వ్యతిరేకత ఎంతవరకు ఉంది? ఒకవేళ ఉంటే వాటిని ఎలా అధిగమించాలి? తదితర అంశాలన్నింటినీ క్రోడీకరిస్తారు. వైసీపీ గెలుపునకు అక్కడ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ 25 మంది ఎమ్మెల్యేలద్వారా అమలు చేయించబోతున్నారు.












Click it and Unblock the Notifications