సీఎం జగన్ కీలక నిర్ణయం - ఆ మంత్రుల నుంచి రాజీనామా : విస్తరణ ఎప్పుడంటే..!!
ఏపీలో కేబినెట్ విస్తరణ గురించి కొంత కాలంగా చర్చ సాగుతోంది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి...తన తొలి కేబినెట్ ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రులు రెండున్నారేళ్ల వరకే ఉంటారని..తరువాత కొత్త వారికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం మంది వరకే ఉంటారని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రెండున్నారేళ్ల కాలం ముగియటంతో ఇక , కేబినెట్ విస్తరణ పైన పార్టీలోనూ ..ప్రభుత్వంలోనూ జోరుగా అంచనాలు మొదలయ్యాయి.

మొత్తం మంత్రుల మార్పు వైపే మొగ్గు
కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ బంధువు..సీనియర్ మంత్రి బాలినేని ప్రస్తుత కేబినెట్ లో మొత్తం మంత్రులను మారుస్తున్నారని..జగన్ తీసుకొనే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేసారు. దీంతో..కొంత మందిని తొలిగించి..మరి కొంత మందిని కొనసాగించటం ద్వారా మరిన్ని సమస్యలు వస్తాయనే కారణంతో..ప్రస్తుతం ఉన్న అందరు మంత్రుల ను తొలిగించాలని సీఎం నిర్ణయించినట్లుగా చెబుతూ వచ్చారు. దీంతో..సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని..గత మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడ్డవారికి ఇప్పుడు అవకాశం దక్కుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే, ఇప్పుడు తాజాగా పార్టీలో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

ఆరు నెలలు పొడిగింపుకు వినతులు
కొద్ది రోజులుగా కొందరు మంత్రులు సీఎం జగన్ ను కలిసి తమ మనసులో మాట చెప్పుకున్నారు. కరోనా కారణంగా తాము పూర్తి కాలం పని చేయలేకపోయామని..తమకు మరో ఆరు నెలల పాటు అవకాశం ఇవ్వాలని కోరారు. విస్తరణ ..వారిని తప్పించటం తప్పదని భావిస్తే..తమ స్థానంలో తమ జిల్లాల నుంచి తాము సూచించిన వారికి అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ,దీని పైన సీఎం నుంచి వారికి స్పష్టమైన హామీ లభించలేదు. విస్తరణ తప్పదనే సంకేతాలు మాత్రం వ్యక్తం అయినట్లుగా తెలుస్తోంది. మరో ఆరు నెలలు ఆగితే...తరువాత ఏర్పడే కేబినెట్ కు కేవలం రెండేళ్లే అవకాశం ఉంటుందని... చివరి ఆరు నెలలు ఎన్నికల హడావుడి ఉంటుందని..దీంతో..కొత్తగా మంత్రులయ్యే వారికి ఏడాదిన్నార మాత్రమే అవకాశం దక్కుతుందనే వాదన తెర మీదకు తెస్తున్నట్లుగా తెలుస్తోంది.

విస్తరణ ముహూర్తం ఇదేనంటూ
దీంతో..కేబినెట్ విస్తరణ సంక్రాంతి తరువాత ..బడ్జెట్ సమావేశాలకు ముందుగా పూర్తి చేయాలనే విధంగా సీఎం కసరత్తు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో మొత్తం కేబినెట్ లోని మంత్రులను పక్కన పెడితే అందరూ కొత్తవారైతే ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో పాలనా పరంగా ఇబ్బందులు ఎదర్కొనే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. దీంతో..సీఎం జగన్ తొలుత చెప్పిన విధంగానే 90 శాతం వరకు మంత్రులను మార్చి ..సీనియర్లను కొందరిని కొనసాగించే ఆలోచనలో ఉన్నారని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

ఆ మంత్రుల నుంచి రాజీనామాలు
అందులో భాగంగా..దాదాపుగా 15-18 మంది మంత్రులను తప్పించే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సంక్రాంతి పండుగ తరువాత ఆ మంత్రుల నుంచి రాజీనామా కోరి.. కొత్త వారితో కొత్త కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు పార్టీ ముఖ్యనేతల నుంచి సమాచారం అందుతుంది. ముఖ్యమంత్రి సైతం గతంలో 90 శాతం వరకు మారుస్తానని చెప్పి ఉండటంతో..ఆ నిర్ణయం తీసుకోవటం ద్వారా ఎటువంటి సమస్యలకు అవకాశం ఉండదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ, సీఎం ఇప్పటికే కొత్త కేబినెట్ లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పైన కసరత్తు పూర్తి చేసారు. జిల్లాలు - సామాజిక సమీకరణాల ఆధారంగా పేర్లు సైతం ఖరారు చేసారని సమాచారం.
Recommended Video

సీఎం జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
అయితే, అందరి వినతులను వింటున్న జగన్..అదే సమయంలో మంత్రి పదవులను ఆశిస్తున్న వారి విషయంలోనూ ఆలోచనలు చేస్తున్నారు. అంతిమంగా ఎన్నికల సమయానికి అటు పార్టీ పరంగా..ఇటు ప్రభుత్వ పరంగా ఎవరి సేవలు ఏ రకంగా వినియోగంచుకోవాలనే కోణంలో ఫైనల్ నిర్ణయం చేయనున్నారు. దీంతో..ప్రస్తుత కేబినెట్ ను మొత్తంగా మారుస్తారా లేక.. 15- 18 మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకొని..వారి స్థానాల్లో మాత్రమే కొత్త వారితో భర్తీ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా పార్టీ పరంగానూ కీలక నిర్ణయాలు తీసుకొనే దిశగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జగన్ తీసుకొనే నిర్ణయాలతో పార్టీలో..కేబినెట్ లో ఎవరికి అవకాశాలు దక్కుతాయి.. ఎవరికి పదవులు పోతాయనే అంశం పైన ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications