గంటా శ్రీనివాసరావుపై అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఖరారు వేగవంతం చేసారు. నియోజకవర్గాల వారీ సమీక్షల్లో భాగంగా అభ్యర్ధులు ఎవరనే దాని పైన క్లారిటీ ఇస్తున్నారు. ముందుగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై సీఎం జగన్ వరుస సమీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా విశాఖ నగరం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితుల పైన ఆరా తీసారు.
2019 నాటి తప్పులు మరసారి చేయద్దు
పలువురు పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో తమ అనుభవాలను నేరుగా ముఖ్యమంత్రికి వివరించారు. నియోజకవర్గంలోని నేతల మధ్య గ్రూపులు - విభేదాలు ఏమున్నా అన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికలు కీలకమని..ఆ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మరో 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేసారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం మేర పూర్తి చేసామని ముఖ్యమంత్రి వివరించారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని.. వై నాట్ 175 సీట్లు అని ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లోనే ఇక్కడ గెలవాల్సి ఉందని..గతంలో జరిగిన పొరపాట్లకు మరోసారి అవకాశం ఇవ్వద్దని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

విశాఖ నార్త్ అభ్యర్ధి పైన స్పష్టత
నియోజకవర్గంలో 1.05 లక్షల ఇళ్లుంటే..దాదాపు 80 వేల ఇళ్లకు ఈ మూడేళ్లలో అనేక పథకాలు అందాయని ముఖ్యమంత్రి వివరించారు. చెప్పిన విధంగా..చెప్పిన సమయానికి సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందించటం తన విధి అని చెప్పిన ముఖ్యమంత్రి.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కేకే రాజునే వచ్చే ఎన్నికల్ల వైసీపీ అభ్యర్ధిగా ముఖ్యమంత్రి ఖరారు చేసారు. నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు.. రోడ్లు.. ఇతర డెవలప్ మెంట్ కార్యక్రమాల గురించి నియోజవకర్గ నేతలు పలు అంశాలను ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. దీనికి సీఎం జగన్ అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, విశాఖ నార్త్ సమావేశం కార్యకర్తలతో ఒక్కొక్కరి నుంచి ముఖ్యమంత్రి అభిప్రాయాలు తీసుకున్నారు.
175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగరాలి
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించటంతో, ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ నియోజకవర్గంలో గంటా పైన వైసీపీ అభ్యర్ధిని సీఎం ఖరారు చేసారు. అయితే, గంటా శ్రీనివాసరావు రాజకీయ అడుగులు మాత్రం అంతు చిక్కనివిగా ఉన్నాయి. ఎన్నికల సమయం వరకు టీడీపీలోనే కొనసాగుతారా లేదా అనేది అక్కడి నేతలకు సస్పెన్స్ గానే మారుతోంది. ఇదే సమయంలో..విశాఖ పరిపాలనా రాజధానిగా చేయాలని పట్టుదలతో ఉన్న సీఎం జగన్.. అమరావతితో పాటుగా విశాఖ నగర పరిధిలోని అసెంబ్లీ సీట్లలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో, ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications