జగన్ సలహాదారుడిగా పీవీ రమేష్: సీఎంఓ లోకి శ్రీలక్ష్మి: రిలీవ్ చేసిన కేంద్రం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు కీలక నియామకాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉంటే ఏరి కోరి తెచ్చుకున్న అధికారి పీవీ రమేష్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా కొనసాగతున్నారు. ఆయన పదవీ విరమణ చేయటంతో ఆయన్ను సలహాదారుడిగా కొనసాగించాలని నిర్ణయించారు. అదే సమయంలో కేంద్రంతో అనేక దఫాలు సంప్రదింపులు జరిగి ఒప్పించి మరీ రిలీవ్ చేయించిన ఐఏయస్ అధికారిణి శ్రీలక్ష్మి ని ముఖ్యమంత్రి కార్యాలయంలో తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం శ్రీలక్ష్మి ని రిలీవ్ చేయటానికి అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం పంపింది. జగన్ అమెరికా నుండి తిరిగి రాగానే శ్రీలక్ష్మి ముఖ్యమంత్రి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే సమయానికి ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర రిలీవ్ ప్రక్రియ సైతం పూర్తవుతుందని..జగన్ విదేశీ పర్యటన నుండి రాగానే..వీరిద్దరూ బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.
సలహాదారుడిగా పీవి రమేష్...
జగన్ ప్రభుత్వంలో మరో అధికారి సలహాదారుడి పదవి దక్కించుకున్నారు. ఇప్పటికే రిటైర్డ్ ఐఏయస్ అధికారులు అజయ్ కళ్లాం..శ్యామ్యూల్ ఇద్దరూ జగన్ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. తాజాగా మరో సీనియర్ ఐఏయస్ అధికారి పీవి రమేశ్ సైతం ఇదే పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర విభజన సమయంలో రమేశ్ ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన విభజన సమస్యల మీద ఏర్పాటు చేసిన కమిటీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగారు. అయితే, అదే సమయంలో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తిరిగి రాష్ట్ర సర్వీసుల్లో చేరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగారు. అయితే, ఆయన పదవీ కాలం ముగియటంతో..కొనసాగింపు కోసం ప్రయత్నిస్తారని భావించారు. కానీ, ఆర్దిక శాఖ లో సుదీర్ఘ అనుభవం..ప్రపంచ బ్యాంకు లో పని చేసిన అనుభవంతో పాటుగా కేంద్రం నుండి ఏపీకి రావాల్సిన సాయం పైన పూర్తి అవగాహన ఉన్న అధికారి కావటంతో...ఆయన సేవలను కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో..ఆయనకు సలహాదారుడి హోదాలో కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి.

సీఎంఓ లోకి శ్రీలక్ష్మి.. రిలీవ్ అయిన స్టీఫెన్
ముఖ్యమంత్రి జగన్ పట్టుబట్టి కేంద్రంతో తన పార్టీకి చెందిన ఎంపీలతో ఒత్తిడి తెచ్చి మరీ ఎట్టకేలకు శ్రీలక్ష్మి ని రిలీవ్ చేయించుకోగలిగారు. కేంద్రం రిలీవ్ చేయటంతో శ్రీలక్ష్మి త్వరలో తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ ఉత్తర్వులు అందుకోనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 15న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తిరిగి 24న అమరావతికి చేరుకుంటారు. ఆయన వచ్చిన తరువాత శ్రీలక్ష్మి ఏపీ అధికారిగా విధుల్లో చేరనున్నారు. శ్రీలక్ష్మి కి ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవి అప్పగిస్తారని సమాచారం. జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి సీబీఐ విచారణ ఎదుర్కోవటంతో పాటుగా జైలు శిక్ష అనుభవించారు. తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీలక్ష్మిని తన ప్రభుత్వంలో పని చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో తెలంగాణలో పని చేస్తూ కేంద్రం నుండి రిలీవ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు సైతం గ్రీన్ సిగ్నల్ లభించింది. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి 75 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ పదవి ఎవరికీ కేటాయించలేదు. ఆ పోస్టు స్టీఫెన్ కు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగించుకొని అమరావతికి చేరుకున్న తరువాత స్టీఫెన్ రవీంద్ర .. శ్రీలక్ష్మి ఇద్దరూ ఏపీలో బాధ్యతలు స్వీకరించనున్నారు.












Click it and Unblock the Notifications