రోడ్ల నిర్మాణం పై సీఎం జగన్ కీలక నిర్ణయం - రాజకీయ విమర్శలకు చెక్..!!
ఏపీలో రోడ్ల అంశం రాజకీయ అంశంగా మారింది. రోడ్ల మరమ్మత్తులు ప్రారంభించామని ప్రభుత్వం చెబుతుంటే..ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష చేసిన కీలక ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి రోడ్ల నిర్మాణం పైన రియల్ టైం మానిటరింగ్ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేసారు. పాలనా పరమైన నిర్ణయాలను వేగవంతం చేసిన సీఎం..ప్రజలతో సంబంధాలు ఉండే శాఖలతో నిరంతర సమీక్షలు చేస్తున్నారు.
నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించారు. దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం. ఇందు కోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తోంది. ఏపీ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్ పేరుతో ఈ యాప్ ను అందుబాటులోకి తెస్తున్నారు. దీని ద్వారా రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణ, వీధిలైట్లు, నిర్వహణ, పుట్పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్ టాయ్లెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్ జంక్షన్లు, వాటి నిర్వహణ అంశాలపై రియల్ టైం మానిటరింగ్ చేస్తారు. అదే సమయంలో రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో ఈ మౌలికసదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.
సచివాలయ వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతిరోజూ రోడ్లపై నిరంతర పర్యవేక్షణతోపాటు, పైన పేర్కొన్న వాటిపై నిరంతర తనిఖీలు చేయాలని స్పష్టం చేసారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్ ద్వారా అప్లోడ్ చేయాలన్నారు. గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పౌరులకూ ఫోటోలు అప్లోడ్ చేసే అవకాశం ఇవ్వాలని సూచించారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు ఈ సమస్యలు సంబంధిత విభాగాలకు.. అక్కడనుంచి పరిష్కారాలు చూపటంతో పాటుగా పరిష్కారంపైనా మానిటరింగ్ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తీసుకొస్తున్న యాప్ ద్వారా వచ్చే గ్రీవెన్స్ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలని సీఎం స్పష్టం చేసారు. వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశంపైనాకూడా దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.