ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలను మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు,హెచ్వోడీల కార్యాలయాల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు మొదట ఈ అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక వారానికి ఐదు రోజుల పని దినాలను ఏడాది పాటు పొడగించారు. ఆ గడువు ఈ నెల 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్... ఈ ఆప్షన్ను కొనసాగించాలా వద్దా అని చర్చించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఉద్యోగులు కూడా ఉత్కంఠకు గురయ్యారు.
తాజాగా మరో ఏడాది పాటు ఆ ఆప్షన్ను పొడగించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందినట్టయింది. రాజధాని తరలింపు తర్వాత చాలామంది సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో చాలామంది వారం ప్రారంభంలో అమరావతికి వచ్చి... వారాంతంలో తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. ఐదు రోజుల పనిదినాల ఆప్షన్ వారికి బాగా ఉపయోగపడుతోంది. ఒకవేళ కరోనా వైరస్ లేకపోయి.. ప్రభుత్వం ఈపాటికి రాజధానిని విశాఖకు తరలించి ఉంటే...ప్రభుత్వం 5 పని దినాల ఆప్షన్ను పొడగించేది కాదేమోనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.