వైసీపీ కొత్త ఎమ్మెల్సీలెవరు - సీఎం అనూహ్య నిర్ణయాలతో : కేబినెట్ విస్తరణ వేళ- వీరికి ఖాయమంటూ..!!
ఏపీలో పెద్దల సభకు కొత్త ఎంపిక అయ్యేది ఎవరు. ఎవరికి అవకాశం దక్కనుంది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్దం అవుతున్నారు. మొత్తం మంత్రుల ను తప్పించి..కొత్త వారితో ఎన్నికలకు సిద్దం కావాలనే ఆలోచనలు చేస్తున్నారు. దీనికి ముందుగానే ఇప్పుడు శానన మండలిలో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. చాలా రోజులుగా ఖాళీలు ఉన్నా.. స్థానిక సంస్థల కోటా నుంచి కావటంతో..ఎన్నికల ఫలితాల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అదే సమయంలో కరోనా కారణంగా ఎన్నికల సంఘం సైతం ఎమ్మెల్సీల ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది.
ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కసరత్తు
ఇప్పుడు పెండింగ్ లో ఉన్న అన్ని ఎన్నికలను వరుసగా నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం ఒకటి రెండో రోజుల్లోనే ఏపీ శాసనమండలి ఖాళీల భర్తీకి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మండలిలో ప్రస్తుతం వైసీపీకి 12 స్థానాలు, టీడీపీకి 15, బీజేపీకి ఒక స్థానం ఉన్నాయి. నలుగురేసి చొప్పున పీడీఎఫ్, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు ఉన్నారు. గవర్నర్ కోటా నామినేటెడ్ సభ్యులు 8 మంది ఉన్నారు. మొత్తం 58 మంది సభ్యులకు గాను 14 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.అందులో భాగంగా.. ప్రస్తుతం శాసన మండలిలో 14 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.
కేబినెట్ విస్తరణ సమయంలో కీలకంగా
అందులో స్థానిక సంస్థల కోటా నుంచి 11 స్థానాలు..ఎమ్మెల్యే కోటా నుంచి మూడు స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీనే మెజార్టీ సాధించటంతో ఆ 11 స్థానాలు వైసీపీ ఖాతాలోనే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఎమ్మెల్యేల సంఖ్యా పరంగానూ వైసీపీకే మిగిలిన మూడు స్థానాలు దక్కనున్నాయి. దీంతో..మొత్తంగా 14 స్థానాలు వైసీపీకే దక్కనుండటంతో ...ఈ పదవుల కోసం ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. అందునా..త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే సమాచారంతో..ఇప్పుడు ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీలుగా కేబినెట్ లో స్థానం దక్కుతుందనే ఒక నమ్మకం కనిపిస్తోంది.
2024 ఎన్నికల కోసం కొత్త టీం
ఇక, ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఈ స్థానాల భర్తీ దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో జిల్లాల వారీగా పోటీలో దింపే వారిని..ఎమ్మెల్యేల కోటా లో భర్తీ చేయాల్సిన ముగ్గురి పైన సీఎం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. పూర్తిగా సామాజిక సమీకరణాలు.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడేలా అభ్యర్థులను ఖరారుచేయాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన వారికి ఈ సారి ఖాయంగా అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.
హామీ ఇచ్చిన వారికి...ప్రాతినిధ్యం దక్కని వారికి
అందులో భాగంగా గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్ పేరు ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేసిన సీనియర్ నేత ఉమ్మారెడ్డి రాజ్యసభకు వెళ్లాలని కోరుకుంటున్నారు. అయితే, ఆయన్ను తిరిగి శాసన మండలికే ఎంపిక చేస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తాజాగా పదవీ విరమణ చేసిన మండలి ఛైర్మన్ కోటాలో రాయలసీమ ప్రాంతానికి చెందిన మైనార్టీ నేతతో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి 2019 ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసి ఓడినా..ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచికి ఛాన్స్ దక్కవచ్చని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కోటాలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పారిశ్రామిక వేత్త బీదా మస్తాన్ రావుకు ఖాయమని తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి మద్దతు ఉంది.
వీరికి ఖాయమైందంటూ పార్టీలో ప్రచారం
ఇక, చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అందులో ఒకటి కుప్పం నుంచి చంద్రబాబు పై గతంలో పోటీ చేసి ఓడిపోయిన చంద్రమౌళి కుమారుడు భరత్ కు స్థానం ఖాయమని సమాచారం. చంద్రమౌళి మరణంతో భరత్ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో పట్టు సాధించిన వైసీపీ..దీనికి కంటిన్యూ చేసేందుకు ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలోని నేతలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇక, ఇప్పటి వరకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం దక్కని వర్గాలను గుర్తించి..వారికి స్థానం కల్పించే దిశగా కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం.
Recommended Video
అనూహ్య నిర్ణయాల దిశగా సీఎం కసరత్తు
దీని ద్వారా వచ్చే ఎన్నికల నాటికి అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీగా వైసీపీని గుర్తించేలా జగన్ వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..14 సీట్లు ఇప్పుడు వైసీపీ నుంచి భర్తీ కానుండటంతో.. అనూహ్య నిర్ణయాలు.. ఊహించని విధంగా ఎమ్మెల్సీల ఎంపిక ఉండే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. అయితే, ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన తరువాతనే అధికారికంగా వైసీపీ ఈ పేర్లను ప్రకటించనుంది.