సీఎం జగన్ "మెగా" స్ట్రాటజీ - మోహన్ బాబుకు టిట్ ఫర్ టాట్ : చంద్రబాబు - పవన్ కు ఆ రూట్ లో.!!
ఏపీలో 2024 ఎన్నికల లక్ష్యంగా రాజకీయం మొదలైంది. అప్పుడే ఎత్తులు.. పొత్తుల లెక్కలతో పార్టీలు ఆసక్తర అడుగులు వేస్తున్నాయి. టీడీపీ అధినేత ఎలాగైనా ఈ సారి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుగానే రంగంలోకి దిగారు. సీఎం జగన్ సైతం ఎక్కడికక్కడ కౌంటర్ రాజకీయాలతో ముందుకెళ్తున్నారు. ఇక, తాజాగా కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. పవన్ కళ్యాణ్ కు ప్రేమ సందేశం పంపారు.
పవన్ దానిని తిరస్కరించలేదు. పెండింగ్ లో పెట్టారు. మైండ్ గేమ్ గా చెప్పకొచ్చారు. కానీ, ఖరాఖండిగా నో అని చెప్పలేదు. ఆలోచిద్దాం అంటూ ఆ ప్రతిపానదను సజీవంగా ఉంచారు.
సీఎం జగన్ - మెగాస్టార్ భేటీతో
ఇదే సమయంలో టాలీవుడ్ వర్సస్ ఏపీ ప్రభుత్వం మధ్య మొదలైన టిక్కెట్ల వివాదం పీక్ కు చేరింది. ఈ సమయంలో ఆకస్మికంగా ఎప్పుడో అడిగిన అప్పాయింట్ మెంట్ కు సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవికి పిలుపు వచ్చింది. తాను సీఎం పిలిస్తేనే వచ్చానని..ఒక్కరిని రమ్మంటే ఒక్కడిగానే వచ్చానంటూ చిరంజీవి ఏయిర్ పోర్టులో దిగిన సమయంలోనూ.. .తిరిగి వెళ్లే సమయంలోనూ చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. ఇండస్ట్రీ నుంచి వివాదం మదిరే సమయంలో సీఎం జగన్ తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవికే గుర్తింపు ఇచ్చారు. చిరంజీవితో తానే ఒన్ టు ఒన్ మాట్లాడారు.
సీఎం ఆహ్వానిస్తేనే వచ్చానంటూ
కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ తాను సినిమా పెద్దను కాదని..తాను పంచాయితీలు చేయలేనని తేల్చి చెప్పారు. ఆ వెంటనే మోహన్ బాబు ఓపెన్ లెటర్ విడుదల చేసారు. దీంతో..సీఎం జగన్ తో సత్సంబంధాలు ఉన్న మోహన్ బాబు చర్చల బాధ్యతలు తీసుకొని..ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తారనే చర్చ మొదలైంది. కానీ, సీఎం జగన్ మోహన్ బాబును చర్చలకు పిలవలేదు.
గత ఎన్నికల్లో మోహన్ బాబు సీఎం జగన్ గెలుపు కోసం ఎన్నికల్లో ప్రచారం చేసినా..ఆ తరువాత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో బీజేపీలో చేరుతారా అనే ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానంటూ సమాధానం ఇచ్చారు. నో అని మాత్రం చెప్పలేదు. దీనికి ఇప్పుడు సీఎం జగన్ సమాధానంగా చిరంజీవికి ప్రాధాన్యత ఇచ్చారా అనే చర్చ సాగుతోంది. ఇక,చిరంజీవి తో సంబంధాల పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.
చిరంజీవికి పెద్దరికం ఇవ్వటం ద్వారా
రాజకీయాల్లోకి రాకముందు..ఇప్పుడూ తనతో బాగానే ఉంటారంటూ చెప్పటం ద్వారా మెగా ఫ్యామిలీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయనే సంకేతాలిచ్చారు. అటు పవన్ తో మైత్రి .. ఇటు చిరంజీవితో సంబంధాల ప్రస్తావన వెనుక అసలు వ్యూహం ఏంటనేది సీఎం జగన్ అంచనా వేసారు. వెంటనే చిరంజీవికి గుర్తింపు ఇస్తూ సీని పెద్దలందరినీ కాదని..చిరంజీవి ద్వారానే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పావులు కదుపుతున్నారు.
ఇక, ఇదే సమయంలో ఏపీలో కాపు సామాజిక వర్గ ప్రముఖులు రాజకీయంగా తమకు ప్రాధాన్యత దక్కేలా ఐక్యతా రాగం వినిపిస్తూ..వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అటు పవన్ తో ప్రేమ సందేశం..ఇటు వంగవీటి రాధా ఇంటికి వెళ్లి తాను రంగా కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యత చాటుకొనే ప్రయత్నం చేసారు.
జగన్ పొలిటికల్ ప్లాన్ లో భాగంగానా
దీంతో.. రాజకీయంగా సక్సెస్ కాలేకపోయినా... చిరంజీవికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందులో భాగంగానే సీఎం జగన్ - చిరంజీవి ఒన్ టు ఒన్ మీటింగ్ లో సైతం మీరు అందరివాడు అంటూ జగన్ పేర్కొనటం.. తనను సోదరుడిగా చూసారని చిరంజీవి చెప్పటం.. తనకు సీఎం నివాసంలో లభించిన ఆత్మీయతతో మెగాస్టార్ ఉప్పొంగిపోవటం చూస్తుంటే..సీఎం జగన్ "మెగా " ప్లాన్ ఫలితాలిచ్చే అవకాశం కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇక, ఆ వెంటనే అంబటి రాంబాబు అన్నయ్య ను చూసి నేర్చుకో తమ్ముడు అంటూ... చేసిన వ్యాఖ్యలు ఈ విశ్లేషణకు మరింత మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో.. జగన్ - చిరంజీవి మధ్య రెండేళ్లుగా బల పడుతోన్న బంధం.. రాజకీయంగా మారుతుందా అనేది ఇప్పుడు వైసీపీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో..ఏం జరగబోతోందనేది మరి కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.