వైసీపీ నుంచి రాజ్యసభకు ఆదానీ సతీమణి..!! బొత్సా సైతం : మిగిలిన ఇద్దరూ వీరే..!!
వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురు ఎవరు. సీఎం జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరిని ఎంపిక చేయనున్నారు. ఇప్పుడు వైసీపీలో ఇది ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. అయితే, వైసీపీ నుంచి రాజ్యసభకు నలుగురు ఎంపిక కానున్నారు. ఆ నలుగురి పైన సీఎం ఒక స్పష్టతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ నుంచి జూన్ 21తో నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల కానుంది.
విజయ సాయిరెడ్డికి మరో ఛాన్స్
రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారిలో వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, బీజేపీ నుంచి సురేశ్ ప్రభు, వైవీ చౌదరి, టీజీ వెంకటేశ్ పదవీవిరమణ చేస్తారు. సామాజిక సమీకరణాలు పక్కగా పాటించే సీఎం జగన్ ఈ సారి ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాలగు స్థానాల్లో భాగంగా..విజయ సాయిరెడ్డికి తిరిగి రెన్యువల్ ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు తాజా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ పదవి ఇవ్వటంతో కొంత సందేహాలు వ్యక్తం అయినా... రాజ్యసభకు కొనసాగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక, రెండో స్థానం పారిశ్రామిక వర్గానికి చెందిన ఆదానీ కుటుంబానికి ఇవ్వనున్నట్లుగా కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.
ఆదానీ సతీమణికి దాదాపుగా ఖరారు
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది కాలానికే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సీఎం నివాసానికి వచ్చారు. తన సహచరుడు పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు కోసం చర్చలు చేసారు. ఫలితంగా వైసీపీ నుంచి పరిమళ్ నత్వానీ రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇక, ఇప్పుడు మరో పారిశ్రామిక వేత్త ఆదానీ కుటుంబానికి వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆదానీ సతీమణి ప్రీతీ అదానీ వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగు పెట్టటం ఖాయమైందని పార్టీలో ముఖ్య నేతలు చెబుతున్నారు. దీని ద్వారా అంబానీ..ఆదానీ ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన వారు వైసీపీ నుంచి రాజ్యసభలో సభ్యులుగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, మైనార్టీ వర్గానికి సైతం రాజ్యసభ లో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం కల్పించాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సినీ పరిశ్రమ - మైనార్టీ కోటాలో ఆలీ
అందులో భాగంగా సినీ పరిశ్రమ కు ప్రాధాన్యత ఇస్తూ..మైనార్టీ వర్గానికి చెందిన ఆలీని రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. దీని పైన కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నా..ఆ తరువాత ఆయనకు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఇస్తారనే వాదన బయటకు వచ్చింది. అయితే, సాంకేతికంగా ఆలీకి ఆ పదవికి అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో..గత కొంత కాలంగా మైనార్టీ వర్గానికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాధాన్యత దక్కలేదు. ఇప్పుడు ఆలీకి ఇవ్వటం ద్వారా మైనార్టీ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనేది సీఎం అంచనాగా చెబుతున్నారు. ఇక, నాలుగో స్థానం కోసం వైసీపీలో గట్టి పోటీనే నెలకొంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..ప్రభుత్వ సలహాదారు సజ్జల సైతం రాజ్యసభ కోరుకుంటున్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది.
నాలుగో స్థానంలో బొత్సా - పోటీగా
అయితే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయ సాయిరెడ్డికి రెన్యువల్ చేస్తే..అదే వర్గానికి చెందిన మరొకరికి అవకాశం లేనట్లే. దీంతో.. ప్రస్తుతం సీనియర్ మంత్రిగా ఉన్న బొత్సాకు రాజ్యసభకు పంపే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం కల్పించాలనేది సీఎం ఆలోచనగా సమాచారం. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రులను తప్పించి..సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే అభిప్రాయం ఉంది. అందులో భాగంగా...బొత్సాకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. దీని ద్వారా ప్రీతి ఆదానీ, విజయ సాయిరెడ్డి, ఆలీ పేర్లు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి.
కాపు లేదా ఎస్సీ వర్గానికి ఛాన్స్
నాలుగో స్థానం కోసం కాపు లేదా ఎస్సీ - ఎస్టీ వర్గా నికి అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ ఇప్పటి వరకు అవకాశం ఇవ్వని వర్గాలకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలనేది సీఎం జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో.. నాలుగో పేరు విషయంలో అనూహ్యంగా సీఎం జగన్ ఎవరి పేరు ఎంపిక చేస్తారనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ కు ముందే పేర్లను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.