బద్వేలులో రూ.400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ , కడప జిల్లాకు వరాల జల్లు !!
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బద్వేలు నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సొంత జిల్లాలో జగన్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.
జగన్ వర్సెస్ కేసీఆర్ ... ఇద్దరూ సమ ఉజ్జీలే.. తాజా జలజగడం వెనుక ఆధిపత్య పోరు !!
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జగన్ రాష్ట్రంలోనే వెనుకబాటు లో ఉన్న నియోజకవర్గం బద్వేల్ అని, గత పాలకులు బద్వేలు నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని ఈ సందర్భంగా మాట్లాడారు. బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. బ్రహ్మ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్ళు ఎప్పుడు నిండు కుండలా ఉండాలని పేర్కొన్న జగన్ కుందూ నది పై లిఫ్ట్ ద్వారా బ్రహ్మ సాగర్ కు నీళ్లు అందిస్తామని వెల్లడించారు.
36 కోట్ల రూపాయలతో బ్రహ్మ సాగర్ ఎడమ కాలువ లో ఎత్తిపోతలకు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 80 కోట్ల రూపాయలతో లోయర్ సగిలేరు కాలువల విస్తరణ పనులు చేపడుతున్నామని బ్రాహ్మణ పల్లి వద్ద సగిలేరు పై 9.5 కోట్ల రూపాయలతో మరో వంతెన నిర్మిస్తామని సీఎం జగన్ వెల్లడించారు 7.5 కోట్ల రూపాయలతో గోదాముల నిర్మాణం తో పాటుగా, బద్వేలులో నూతన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఇక బద్వేలులో కూరగాయల, చేపల మార్కెట్ లతో పాటుగా వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తామన్నారు.
Recommended Video
మధ్యాహ్నం ఎర్రముక్కపల్లి లోని సి.పి.బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ కి వెళ్లి సి.పి.బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. అలాగే సి.పి.బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆపై జిల్లా కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.