ఇరకాటంలో సీఎం జగన్.. కిం కర్తవ్యం.: చంద్రబాబుకు క్రెడిట్ ఇచ్చామా: సీనియర్లతో అత్యవసర భేటీ..!
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కొనసాగింపును ఆరు వారాల పాటు నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పైన ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలని స్వయంగా గవర్నర్ ను కోరారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి నేనా..రమేష్ కుమారా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. దీని పైన సుప్రీం కోర్టుకు వెళ్లగా..అక్కడా ఎన్నిక ల సంఘానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. స్వయంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఈ తీర్పు ఇవ్వటంతో..ఇక, న్యాయ పరంగా దారులు మూసుకుపోయినట్లే. అయితే, ముఖ్యమంత్రి జగన్ దీనిని అంత సులువుగా వదలటానికి సిద్ద పడటం లేదు. చంద్రబాబు ఒత్తిడితోనే ఎన్నికలు వాయిదా వేశామని వైసీపీ నేతలే ప్రచారం చేయటంతో..ఇప్పుడు ఇది ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో..ఇప్పుడు ఏం చేయాలనే అంశంతో పాటుగా..ప్రభుత్వం ముందు ఉన్న ప్రత్యామ్నాయాలేంటనే అంశం పైన సీనియర్ మంత్రులతో సమావేశం కావాలని సీఎం జగన్ నిర్ధేశించారు. వచ్చే వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
సుప్రీం తీర్పు..ప్రత్యామ్నాయాలపైనే ఆలోచన
ఎన్నికల సంఘం తమతో సంప్రదింపులు చేయకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేయటాన్ని ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్నారు. దీని పైన నేరుగా వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు కు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మండిపడ్డారు. దీంతో..ఇది ఒక రకంగా చంద్రబాబు వర్సెస్ ముఖ్యమంత్రి జగన్ మధ్య ప్రతిష్ఠాత్మక అంశంగా వైసీపీ నేతల వ్యాఖ్యలే క్రియేట్ చేశాయి. ముఖ్యమంత్రిగా జగన్ ఉండగా..చంద్రబాబు ప్రభావంతో ఎన్నికలు వాయిదా పడటం ఏంటనే చర్చకు వైసీపీ నేతల వ్యాఖ్యలు పరోక్షంగా కారణమయ్యాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్
ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ సైతం తాను గవర్నర్ కు ఫిర్యాదు చేసానని..ఎన్నికల కమిషనర్ వైఖరి మారకుంటే మరింత ముందుకు వెళ్తామని స్పష్టం చేసారు. మరోవైపు చంద్రబాబు సైతం కరోనా గురించే పదే పదే మాట్లాడుతూ.. ఎన్నికల్లో అరాచకాలు చేస్తుంటే తాము చూస్తూ కూర్చోవాలా అనే వ్యాఖ్యలతో పరోక్షంగా వైసీపీ నేతలకు సవాల్ విసిరారనే విశ్లేషణలు మొదలయ్యాయి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా..అక్కడ ప్రతికూల ఫలితం వచ్చింది. ఇక, న్యాయ పోరాటం పైన ముందుకు వెళ్లే అవకాశం లేదు. దీంతో..రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పరంగా తమ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాల పైన న్యాయ నిపుణులతో చర్చలకు సిద్దం అవుతున్నట్లు సమాచారం.
వ్యూహాత్మకంగా మౌనం పాటిద్దామా..ముందుకే వెళ్తామా..
ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఎన్నికల సంఘం అధికారాల పైన ప్రశ్నించిన అధికార పార్టీ నేతలకు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఇరకాటం మొదలైంది. ఎన్నికలు ఆరు వారాల వరకు జరగవని తేలి పోయింది. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా రిజర్వేషన్ల మొదలు..ఎన్నికల షెడ్యూల్ వరకు ప్రభుత్వం మొత్తంగా తమ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడటం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమయానికి కొంత సిద్దమయ్యే వెసులుబాటు కలుగుతుంది. దీంతో పాటుగా..కరోనా వ్యవహారం రోజు రోజుకీ సమస్యగా మారుతోంది.
Recommended Video
ప్రభుత్వం ముందున్న అస్త్రాలు
దీనిని పరిగణలోకి తీసుకొని ..ఈ వ్యవహారాన్ని మరింత ముదురకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటించాలా..లేక ప్రభుత్వం ముందు ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించాలా అనేదే ఇప్పుడు ప్రభుత్వం కీలక చర్చగా మారింది. దీని పైనే సీనియర్ మంత్రులతో పాటుగా న్యాయ నిపుణులతో చర్చించేందుకు సీఎం సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం ముందున్న అవకాశాలను వినియోగించుకోవాలనే భావిస్తే..వెంటనే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకొని సభా వేదికగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ మంత్రులతో సీఎం సమావేశం తరువాత దీని పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.