ఏపీకి 3 రాజధానులు..వికేంద్రీకరణ తప్పదు: అమరావతి కట్టాలంటే లక్ష కోట్లు కావాలి: సభలో సీఎం జగన్ సంచలనం
ఏపీ రాజధాని పైన తన అభిప్రాయం ఏంటో ముఖ్యమంత్రి జగన్ సభలో స్పష్టం చేసారు. ఇప్పటి వరకు అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే సందేహాల నడుమ ఏపీలో మూడు రాజధానులు అసవరమని అభిప్రాయ పడ్డారు. అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా..విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా..కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి జ్యుడిషియల్ కేపిటల్ గా అమలు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
దీని పైన ఇప్పటికే ప్రభుత్వం నియమించిన అధికారిక కమిటీలు నివేదిక ఇచ్చిన తరువాత.. అందరు కూర్చొని సరైన నిర్ణయం తీసుకుందామని సీఎం ప్రతిపాదించారు. దీని పైన త్వరలోనే నిర్ణయం తీసుకుందామన్నారు. దీని ద్వారా ఒక అమరావతిలో మాత్రమే మొత్తం అన్ని వ్యవస్థలు ఉండవని సీఎం చెప్పకనే చెప్పారు.
మూడు రాజధానులతో వికేంద్రీకరణ
ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో కీలక ప్రతిపాదన చేసారు. ఇప్పుడు అమరావతిలోనే అన్ని వ్యవస్థలను కేంద్రీకరించకుండా...మూడు ప్రాంతాల్లోనూ మూడు కీలక వ్యవస్థలను ఏర్పాటు చేసి వికేంద్రీకరణ చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసారు. అందులో భాగంగా..ప్రస్తుతం ఉన్న అమరావతిని లెజిస్లేచర్ కేపిటల్ గా కొనసాగిస్తూ..విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలనే ఆలోచన బయట పెట్టారు.
అక్కడ నామ మాత్రపు ఖర్చుతో చేయవచ్చన్నారు. అదే విధంగా అక్కడ మెట్రో ఏర్పాటు చేస్తే సరిపోతుందన్నారు. అదే విధంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి రాయలసీమలొ జ్యుడిషియరీ కేపిటల్ చేయాలనే ఆలోచన బయట పెట్టారు. దీని పైన తాము ఇప్పటికే రెండు కమిటీలు ఏర్పాటు చేసామని..అన్ని ప్రాంతాలను డెవలప్ చేసే విధంగా.. తక్కువ ఖర్చుతో రాష్ట్రం మొత్తం డెవలప్ చేసే విధంగా మన ఆలోచనలు మార్చుకోవాలని..కొత్త నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. దీని పైన అందరం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుందామని సీఎం స్పష్టం చేసారు.
రాజధానికి లక్ష కోట్లు కావాలి..ఎక్కడ తేవాలి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4070 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. బినామీ పేర్లతో భూములు కొన్నారు. రాజధాని తొలి దశ నిర్మాణానికి 1.09 లక్షల కోట్లు అవసరమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయి. అయితే, అయిదేళ్ల కాలంలొ ఆయన కేవలం 5800 కోట్లు మాత్రమే ఖర్చు చేసారు.
అందులోనూ బాండ్లు..అప్పుల ద్వారా తెచ్చారు. దీని కోసం ప్రతీ ఏటా రూ 700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దీనిని అప్పు తేవాలంటే.. ఎంత వడ్డీ కావాలి. మనం కట్టగలమా అని ఆలోచించాలని సూచించారు. కేవలం 20 కిలో మీటర్ల పరిధి కోసం లక్ష కోట్లు ఖర్చు చేయటం కంటే రాష్ట్రం మొత్తం డెవలప్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అసవరం ఉందని సీఎం అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం అంత ఖర్చు పెట్టాలని తనకూ ఉన్నా..పరిస్థితులు సహకరించటం లేదని స్పష్టం చేసారు.
ఈ పధకాలకు చాలా ఖర్చు అవసరం..
ఏపీని శశ్య శ్యామలం చేసేందుకు పోలవరం నుండి బొల్లేపల్లి రిజర్వాయర్ కట్టటం పైన ఫోకస్ పెట్టామన్నారు. అదే విధంగా పులిచింతల నింపాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి డీపీఆర్ తయారు చేస్తుంటే..ప్రాధమికంగా 55 వేల నుండి 60 వేల కోట్ల అవసరం అని అధికారులు తేల్చారని చెప్పుకొచ్చారు. సీమకు నీరు ఇవ్వాలంటే..కాల్వలు నిర్మించాలంటే..దీనికి 23 వేల కోట్లు అవసరం అన్నారు. అదే విధంగా..ఉత్తరాంధ్ర.. వెనుకబడిన జిల్లాల కోసం కావాల్సిన విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 16 వేల కోట్లు అవసరమని వివరించారు. తాగునీరు కోసం ఉభయ గోదావరి జిల్లాల్లో వాటర్ గ్రిడ్ తీసుకొని ప్రతీ ఊరికి తాగునీరు ఇవ్వాలంటే.. రెండు జిల్లాలకే దాదాపు 8 వేల కోట్లు అవసరం అని లెక్కలు చెప్పారు.
నాడు నేడు..స్కూళ్లు..ఆస్పత్రుల డెవలప్ మెంట్ కోసం నిర్ణయం తీసుకున్నామని దీని కోసం...కనీస వసతులు కల్పించాలంటే స్కూళ్లు..ఆస్పత్రులకు కలిసి దాదాపు 35 వేల కోట్లు అవసరమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. దీని ద్వారా రానున్న రోజుల్లో ఏపీలో మూడు రాజధానులు ఉంటాయని సీఎం జగన్ సభా వేదికగా పరోక్షంగా స్పష్టం చేసారు.