కరోనా: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. ఆంధ్రులు కాకపోయినా సహాయం.. దిశ చట్టం సూపర్ సక్సెస్..
కరోనా లాక్డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పలు అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడపాలని, మధ్యలోనే ఆగిపోయిన 10వ తరగతి పరీక్షలను జులై 10 నుంచి నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద రూ.5,500 జమచేయాలని నిర్ణయించిన ఆయన.. వలస కూలీలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ వాళ్లు కాకపోయినా..
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది వలస కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి తమ సొంత ఊళ్లకు నడిచి వెళుతోన్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. భోజనం, నీళ్లు అందుబాటులో లేక, కనీసం చెప్పులు కూడా లేని స్థితిలో చిన్నపిల్లలు పడుతోన్న గోసపై సీఎం జగన్ స్పందించారు. ఆంధ్రులు కానప్పటికీ.. ఏపీ గుండా నడుచుకుంటూ వెళ్లే ప్రతి వలస కూలీకి భోజనం, తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఏర్పాటుచేయాలన్నారు. అంతేకాదు, ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి.. కూలీలను బస్సుల్లో తరలించే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు.

ఆ మూడు రాష్ట్రాల వాళ్లే అధికం..
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ గుండా నడుచుకుంటూ వెళుతోన్న వలస కూలీల్లో ఎక్కువ మంది ఒడిశా, జార్ఖండ్, బిహార్ కు చెందినవాళ్లేనని అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. కేంద్రం శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిపై కూలీలకు అవగాహన లేకపోవడం వల్లే సుదీర్ఘ దూరాలు నడుచుకుంటూ వెళుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఏపీ మీదుగా ప్రయాణిస్తున్న వలసకూలీలకు నీరు, ఆహారం అందించి, ఆయారాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో పంపే ఏర్పాట్లు చేయండి''అని ఆదేశించారు.

కూలీల దుర్మరణంపై దిగ్భ్రాంతి..
లాక్ డౌన్ సడలింపులు లభించడంతో ఏపీలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈలోపే ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చీ కూలీలతో వెళుతోన్న ట్రాక్టర్ అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో 10 మంది చనిపోయారు. గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ మురళీ సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అధికారులు సీఎంకు తెలిపారు.

దిశ చట్టం సక్సెస్..
కరోనా సంబంధిత అంశాలతోపాటు కీలకమైన దిశ చట్టంపైనా సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఏపీలో ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 167కేసుల్లో కేవలం 7రోజుల వ్యవధిలోనే ఛార్జిషీట్లు దాఖలు కాగా, 3నెలల వ్యవధిలో 20 కేసుల్లో దోషులకు శిక్షలు కూడా పడ్డాయి. దిశ చట్టాన్ని సక్సెస్ చేయడంతో అధికారుల కృషిని సీఎం అభినందించారు. వీలైనంత తొందరగా ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించేలా, అదేసమయంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యేలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు.
Recommended Video

జులై 1 నుంచి పీహెచ్సీల్లో బైక్స్..
లాక్ డౌన్ కాలంలో ఏపీ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అనే నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్.. అత్యవసర సేవలకు వినియోగించే 108, 104 సర్వీసులపైనా దృష్టిసారించడం, ఆ రెండు సర్వీసులకు కొత్తగా 1060 వాహనాలను కొనుగోలు చేయడం, వాటిని జులై 1 నుంచి ప్రారంభించాలని డిసైడ్ కావడం తెలిసిందే. అయితే కొత్త అంబులెన్సులతోపాటు ఏపీలో టెలీమెడిసిన్ అమలు కోసం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్కో ద్విచక్ర వాహనాన్ని కూడా అదే తేదీలోగా అందుబాటులో ఉంచాలని జగన ఆదేశించినట్లు సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications