టీడీపీ హయాంలో పెట్టిన ఏసీబీ కేసులపై సీఎం జగన్ కీలకనిర్ణయం; రివ్యూకి హైపవర్ కమిటీ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో ఉద్యోగుల పై పెట్టిన ఏసీబీ కేసులపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గతంలో ఉద్యోగులపై పెట్టిన ఏసీబీ కేసుల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
2014 నుండి 2019 వరకు ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులను రివ్యూ చేయడం కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కొందరు ఉద్యోగులపై నాటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏసీబీ కేసులు నమోదు చేసిందని, వాటిని పునఃపరిశీలించాలని అనేక మంది ఉద్యోగులు చేసిన వినతుల ఆధారంగా హై పవర్ కమిటీని నియమించినట్లు గా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ పలుమార్లు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఈ కేసులను పునఃపరిశీలించనుంది.

ఐదుగురు సభ్యులతో హైపవర్ కమిటీ
రెండు వేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిది మధ్యకాలంలో ఉద్యోగులపై నమోదైన ఏసిబి కేసులను రివ్యూ చేయనున్న హైపవర్ కమిటీని ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రెటరీతో పాటు పబ్లిక్ సర్వీసెస్ విభాగపు సెక్రెటరీ సభ్యులుగా ఉండనున్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి మెంబెర్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.

ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కేసులను రివ్యూ నుండి మినహాయింపు
గత ప్రభుత్వ హయాంలో పక్షపాత ధోరణి లో ఉద్యోగులపై నమోదు చేసిన ఏసీబీ కేసులను పరిశీలిస్తామని గతంలో శాసనమండలిలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నమోదు చేసిన కేసులను మినహాయించి, మిగతా పక్షపాత ధోరణితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న భావన తో నమోదు చేసిన ఏసీబీ కేసులను ఈ హైపవర్ కమిటీ పరిశీలించనుంది. మొత్తానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో అప్పట్లో ఏసీబీ కేసులలో చిక్కుకున్న పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ నిర్ణయం పై ఏపీలో చర్చ
హైపవర్ కమిటీ రివ్యూ లో తమకు ఏసీబీ కేసుల నుండి ఉపశమనం దొరుకుతుందని వారు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కావాలని వైసీపీని టార్గెట్ చేసి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో తప్పుడు ఏసీబీ కేసులను కొందరిపై బనాయించారని గతంలో వైసీపీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వైసీపీ హయాంలో ఆ కేసుల విషయంలో రివ్యూ చేయించాలని నిర్ణయం తీసుకోవటం వారికి ఈ కేసుల నుండి ఉపశమనం కలిగించే ఉద్దేశంతోనే అన్న చర్చ ఏపీలో జరుగుతుంది.












Click it and Unblock the Notifications