అమరావతిపై సీఎం జగన్ తేల్చేసారు: ఆ కీలక నిర్మాణాలు ఎక్కడంటే: ఇదీ ముఖ్యమంత్రి ప్రణాళిక..!
కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన ఏపీ రాజధాని వ్యవహారం పైన ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుండి రాజధాని అమరావతిలో నిర్మాణాలను నిలిపివేసారు . టీడీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని..దాని మీద విచారణ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అదే సందర్భంలో మంత్రి బొత్సా లాంటి వారు రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన అనుమానాలు వచ్చేలా వ్యాఖ్యలు చేసారు.
దీని పైన స్థానికంగా ఉన్న రైతుల మొదలు అనేక పార్టీల నేతలు విమర్శలు చేసారు. అయితే, తొలి సారిగా ముఖ్యమంత్రి అమరావతి పైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని పైన ఆరు నెలల కాలంలో నోరు విప్పని ముఖ్యమంత్రి..రాజధాని భవిష్యత్ పైన తేల్చి చెప్పేసారు. అదే సమయంలో పాలనా పరంగా కీలకమైన కార్యాలయాల నిర్మాణం పైన తన ఆలోచన స్పష్టం చేసారు. దీంతో..ఇసుక..రాజధాని వ్యవహారాల పైన ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న ప్రతిపక్షాలకు సీఎం సమాధానం ఇచ్చారు.
దేశ రాజకీయాల్లో పెను మార్పులు.. హైదరాబాద్ రెండో రాజధాని! యూటీ దిశగా అడుగులు?
రాజధానిలో నిర్మాణాలు ఆపొద్దు..
ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాజధాని అమరావతి పైన సాగుతున్న వివాదానికి ముగింపు పలికారు. తొలిసారిగా రాజధాని విషయంలో అధికారులు స్పష్టమైన మార్గ నిర్దేశం చేసారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కొనసాగించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణం, భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన (ఎల్పీఎస్) లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహనిర్మాణాల వంటి... ఇప్పటికే చేపట్టిన పనులన్నింటినీ కొనసాగించాలని నిర్ణయించారు.
వాస్తవాలకు దగ్గరగా...నిధులిచ్చేందుకు సిద్దం
రాజధాని విషయంలో గత ప్రభుత్వం వలే ఆర్బాటపు ప్రకటనలు వద్దని.. వాస్తవానికి దగ్గరగా.. పనుల పరిమాణం..ఖర్చు తగ్గించాలని సీఎం ఆదేశించారు. దానికి అవసరమైన నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణ పనులు డిసెంబరులోను, హ్యాపీనెస్ట్ పనులు జనవరి 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి పక్కనే ఏడంతస్తులుగా నిర్మిస్తున్న సీఆర్డీఏ కార్యా99లయ భవనం పనులూ త్వరలో ప్రారంభించనున్నారు. రాజధానిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు అవసరమైనంత మేరకే రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎనిమిది, ఆరు వరుసలుగా నిర్మించాలనుకున్న రహదారుల వెడల్పు తగ్గించాలని, భవిష్యత్తులో అవసరమైనప్పుడు విస్తరించుకునేందుకు వీలుగా అటూ ఇటూ ఖాళీ ప్రదేశం వదిలిపెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు.
రూ. 15 వేల కోట్లు అవసరం..
మొత్తం రాజధాని ప్రాంతాన్ని 13 జోన్లుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారని, వాటిలో భాగంగానే ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతులూ అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, దీనికి రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల నిర్మాణానికి, సగం పూర్తయిన భవనాల్ని పూర్తి చేసేందుకు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున, వచ్చే మూడేళ్లలో ఈ మొత్తం నిధులు సమకూర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులు గ్రాంటుగా ఇవ్వాలని, బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని ప్రతిపాదించారు. నిపుణులతో సంప్రదించి తగిన ప్రతిపాదనలతో రావాలని సీఎం సూచించారు.
సందేహాలకు తెరదించుతూ... ప్రాజెక్టును కొనసాగించాలని
రాజధానిలో శాఖమూరు పార్క్ పక్కనే సీఆర్డీఏ తలపెట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. 1200 ఫ్లాట్లు నిర్మించి ప్రజలకు విక్రయించేందుకు సీఆర్డీఏ ఈ ప్రాజెక్టు తలపెట్టింది. ఈ ప్రాజెక్టుకు రెండుదశల్లో బుకింగ్ నిర్వహించగా... ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఫ్లాట్లన్నీ బుక్కయ్యాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి, శంకుస్థాపన చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాజధానిలో పనులన్నీ నిలిపివేయడంతో, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టూ ఆగిపోయింది. ఫ్లాట్లు బుక్ చేసుకున్నవారు ఈ ప్రాజెక్టుపైనా సందిగ్ధంలో పడ్డారు. వారి సందేహాలకు తెరదించుతూ... ప్రాజెక్టును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ నిర్మాణాలు ఇప్పుడే కాదు..ఎక్కడంటే
ఇక...పాలనా పరంగా కీలకమైన సచివాలయం.. శాసనసభ..హైకోర్టు విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని పైన ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజధానితో అధికార వికేంద్రీకరణ దిశగా నివేదిక సిద్దం చేస్తున్న సీఎన్ రావు కమిటీ సిఫార్సులకు ఆధారంగా నిర్ణయం తీసుకుందామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతి కొనసాగిస్తూనే..జిల్లాల వారీగా అధికార వికేంద్రీకరణ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో..ఇక..రాజధాని కొనసాగింపు పైన అనుమానాలకు ముఖ్యమంత్రి ముగింపు పలికినట్లుగా స్పష్టం అవుతోంది.