సీన్ మారుతోంది, సీఎం జగన్ అలర్ట్ - గవర్నర్ తో కీలక భేటీ..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వం పై విమర్శల దాడి పెంచాయి. వైసీపీ సంక్షేమం పథకాలనే తాము అమలు చేస్తామంటూ ప్రజల్లోకి వస్తున్నారు. సామాజిక వర్గాల పరంగానూ కొత్త లెక్కలు మొదలయ్యాయి. జాతీయ స్థాయిలోనూ మార్పు కనిపిస్తోంది. ఈ సమయంలో పార్టీ నేతలతో సీఎం జగన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయాలు వెల్లడించనున్నారు. అదే సమయంలో అటు గవర్నర్ తోనూ సీఎం జగన్ భేటీ కావటం ఆసక్తికరంగా మారుతోంది.
ఎన్నికల దిశా నిర్దేశం
వై నాట్ 175. సీఎం జగన్ ఎన్నికల టార్గెట్. ఇదే ధీమాతో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరంలోకి దిగారు. అటు ప్రతిపక్షాలు జగన్ లక్ష్యంగా ఒక్కటవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు యాత్రల పేరుతో ప్రజల్లోకి వచ్చాయి. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. జాతీయ స్థాయిలోనూ సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ అలర్ట్ అయ్యారు. గెలుస్తామనే ధీమా ఉన్నా ఎక్కడా అతి విశ్వాసంతో వ్యవహరించవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేస్తన్నారు. అందులో భాగంగా.. ఈ రోజు పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంపైనా చర్చించనున్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కిరకీ ప్రభుత్వ పథకాలు అందించటం లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. కొత్తగా పథకాల్లో చేరిన వారికి ఆగస్టు 1 నుంచి అవి అందించేలా నిర్ణయం తీసుకున్నారు.

పొత్తులు..మైండ్ గేమ్ పై
ప్రతిపక్షాలు కొత్త మైండ్ గేమ్ ప్రారంభించాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ లక్ష్యం మాత్రం జగన్ అని తేల్చి చెబుతున్నాయి. ఎన్నికల సమయానికి వీరంతా ఒక్కటవుతారని వైసీపీ అధినాయకత్వం పార్టీ నేతలకు స్పష్టం చేస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టటంతో పాటుగా..ఎన్నికల వేళ సీఎం జగన్ రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. గెలుపే ప్రామాణికంగా టికెట్లు ఖరారు చేస్తానని మరోసారి స్పష్టం చేయనున్నారు. ఎమ్మెల్యేల పని తీరు పైన సిద్దమైన సర్వే నివేదికలను వెల్లడించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అర్హత ఉండీ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే ఈ జగనన్న సురక్ష ద్వారా వారికి పధకాలు అందించటంలో చొరవ చూపాలని సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

గవర్నర్ తో సమావేశం
ప్రతిపక్షాలు ఆడుతున్న మైండ్ గేమ్ గురించి సీఎం జగన్ పార్టీ నేతలకు వివరించనున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు తన ప్రభుత్వంపైన చేసిన ఆరోపణలపైన పార్టీ నేతలతో సీఎం జగన్ ప్రస్తావించి..ఏం జరుగుతుందో వివరించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యవహరించాల్సిన కార్యాచరణ పైన ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సమావేశం తరువాత సీఎం జగన్ సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం కానున్నారు. తాజాగా విశాఖలో ఎంపీ నివాసంలో జరిగిన కిడ్నాప్ వ్యవహారంతో పాటుగా.. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన గవర్నర్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇది మర్యాదపూర్వక భేటీ అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications