ఏపీలో పిల్లలకు న్యుమోనియా వ్యాక్సిన్-డ్రైవ్ ప్రారంభించిన జగన్-10కి చేరిన టీకాలు
ఏపీలోని పిల్లల్లో న్యుమోనియా వ్యాధిని నిరోధించేందుకు ప్రభుత్వం ఇవాళ కీలక ప్రయత్నం చేపట్టింది. పిల్లల్లో న్యుమోనియా నివారణ కోసం వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించిన సర్కార్.. ఇందులో భాగంగా డ్రైవ్ ప్రారంభించింది. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో పిల్లలకు వ్యాక్సిన్లు వేసి ఈ డ్రైవ్ ప్రారంభించారు.
న్యుమోనియా వ్యాధి నివారణ కోసం న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్ ను ఇవాళ వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రెండు నెలల చిన్నారికి సీఎం జగన్ సమక్షంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్ వేశారు. అనంతరం చిన్నారని ఎత్తుకుని సీఎం జగన్ ముద్దాడారు.
పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకూ పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లు ఇస్తుండగా.. దీంతో కలిపి ఈ సంఖ్య పదికి చేరనుంది. కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్లు పిల్లలకు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు తొమ్మిది రకాల వ్యాక్సిన్లను విడతల వారీగా ప్రాధమిక, పట్ఠణ ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తున్నారు.

వీటికి కొనసాగింపుగా ఇప్పుడు న్యుమోనియా వ్యాక్సిన్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యాక్సిన్ ను కూడా ఉచితంగానే అందిస్తున్నారు. అసలే కరోనా సమయం కావడం, వ్యాక్సిన్లపై అవగాహన పెరిగిన నేపథ్యంలో ఈ డ్రైవ్ కు ఆదరణ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు ఇంకా అందుబాటులోకి రాని నేపథ్యంలో న్యుమోనియా వ్యాక్సిన్లు వేయించుకనేందుకు తల్లితండ్రులు మొగ్గు చూపే అవకాశముంది.












Click it and Unblock the Notifications