ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒక్క ఫోన్ కాల్కే స్పందిస్తాను - సీఎం జగన్..!!
రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.టెక్ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ హాజరయ్యారు. ఆరు నెలల్లో ఒక పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు ఇప్పించగలిగామంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు.
టెక్ మహేంద్ర సీఈవో సీపీ గుర్నాని కుమారుడు ఆధ్వార్వంలో ఈ పరిశ్రమ ఇక్కడికి రాబోతోందని సీఎం వివరించారు. తాను దావోస్ వెళ్లినప్పుడు అక్కడ నన్ను గుర్నాని కలిశారు. ఏపీకి రావాల్సిన అవసరం, ఏపీలో జరుగుతున్న మంచి, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. తన కుమారుడు ఇథనాల్ ప్లాంట్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారని, మన రాష్ట్రలో పెడితే ఎలా ఉంటుందని అడిగారని చెప్పారు. 2 లక్షల లీటర్ల కేపాసిటీతో ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని సీఎం వెల్లడించారు.
దాని దాదాపుగా 300, 400 మందికి ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు, మన ప్రాంతానికి 70శాతం లోకల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేయటంతో స్థానికంగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా ఈ ప్లాంట్ మేలు చేస్తుందని చెప్పారు. తూపాన్లు, వరదలు వచ్చినప్పుడు ధాన్యం రంగు మారిపోవడం, ముక్కి పోవడం, విరిగిపోయిన నూకలుగా మారేవి. ఈ సమస్యకు ఈ ప్లాంట్ పరిష్కారం ఇస్తుంది. రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. గుర్నాని మన రాష్ట్రం గురించి పెద్ద పెద్ద పరిశ్రామిక వేత్తల వద్ద ప్రస్తావిస్తారని, ఆయన నుంచి ఇంకా పరిశ్రమలు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నానని సీఎం చెప్పుకొచ్చారు. పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒక్క ఫోన్ కాల్కే స్పందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.