వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రారంభించిన సీఎం జగన్ .... కాపు మహిళలకు రూ.15వేల ఆర్ధిక సాయం
ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ పథకాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించారు.
Recommended Video
90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కరోనా పరీక్షలు ... సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలివే !!
వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభం... జగన్ ఏం చెప్పారంటే
ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కాపు మహిళలను ఉద్దేశించి, వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడానికి ప్రభుత్వం అందిస్తున్న వైయస్సార్ కాపు నేస్తం ఉద్దేశించి మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళలతో మాట్లాడిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారం చేపట్టిన 13 నెలల పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు .
వివక్షకు తావు లేకుండా సంక్షేమం
ఎక్కడ వివక్షకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి ప్రభుత్వం నుండి చేయూతని అందిస్తున్నామని పేర్కొన్నారు. 3.98 కోట్ల మందికి 43 వేల కోట్ల రూపాయలను నేరుగా అందించామని ఆయన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేశామని,ఇచ్చిన హామీలను 90% నెరవేర్చామని పేర్కొన్న ఏపీ సీఎం జగన్ అమ్మ ఒడి, వసతి దీవెన,విద్యా దీవెన వంటి పథకాలు విద్యార్థుల కోసం అందించామని తెలిపారు.
సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు
ఇక రైతుల కోసం రైతు భరోసా అందిస్తున్నామని,విత్తనాలు ఎరువులను అందించే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు.ఇక వృద్ధులకు ,వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ కానుక అందిస్తున్నామని తెలిపారు. వాహన మిత్ర ద్వారా టాక్సీ డ్రైవర్ లకు,ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, జగనన్న చేదోడు ,నేతన్న నేస్తం, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2,37,873 మంది కాపు మహిళలకు లబ్ది
ఇక నేడు వైయస్సార్ కాపు నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,37,873 మంది కాపు మహిళల ఖాతాలలో ఆర్థిక స్వావలంబనగా పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు సంబంధించిన మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే ఈ పథకాన్ని అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపుల కోసం చేసింది ఏమీ లేదని ప్రస్తుతం తాము 354 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు.
4700 కోట్ల రూపాయలు వివిధ పథకాల కోసం ఇచ్చిన సర్కార్
ఇక ఇప్పటి వరకు 4700 కోట్ల రూపాయలను వివిధ పథకాల కోసం అందించామని ఆయన అన్నారు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు జగన్. ఇక ఈ ఐదేళ్ల కాలానికి మొత్తం 75 వేల రూపాయలు కాపు మహిళల ఖాతాలలో జమ కానున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు .లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని జగన్ తెలిపారు.